ఎట్టిపరిస్థితుల్లోనూ లాక్డౌన్ విధించం : సీఎం కేసీఆర్ స్పష్టీకరణ

శుక్రవారం, 26 మార్చి 2021 (14:29 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో లాక్డౌన్ విధిస్తారని, లేకపోతే కనీసం వారాంతంలోనైనా అన్నీ మూసేస్తారనే వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. 
 
ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్డౌన్ విధించబోమన్నారు. టాలీవుడ్‌కు చెందిన కొందరు సినీ ప్రముఖులు లాక్డౌన్ నిర్ణయం తీసుకుంటున్నారా అని తనను అడిగారని, అయితే అలాంటి నిర్ణయం ఏదీ లేదని వారికి వివరించానని కేసీఆర్ తెలిపారు.
 
"కొందరు సినీ ప్రముఖులు నన్ను కలిశారు. ఇప్పటికే పలు చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయని, పెట్టుబడులు పెట్టామని ఆ సినీ ప్రముఖులు వివరించారు. గతంలో విధించిన లాక్డౌన్ తో బాగా నష్టపోయాం... మరోసారి లాక్డౌన్ దిశగా చర్యలు లేవని వారికి స్పష్టంచేశాను. 
 
అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగానే విద్యాసంస్థలను మూసివేశాం. విద్యాసంస్థలను మూసివేయాల్సి రావడం బాధ కలిగిస్తున్నా, తప్పలేదు" అని పేర్కొన్నారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు