లక్కీ డ్రాలో రూ.కోటి గెలుచుకున్నారని మోసం.. వీడియో కాల్‌ చేసి ఆత్మహత్య

సోమవారం, 25 జనవరి 2021 (14:24 IST)
సైబర్ నేరగాళ్లను ఎంత కట్టడి చేసినా వేధింపులు మాత్రం ఆగడం లేదు. వారికి బలైపోవడం జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఫోన్ల ద్వారా రుణాలు ఇచ్చి వేధింపులకు గురి చేయడంతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహ్యకు పాల్పడంతో దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు పోన్‌ రుణాల ముఠాలను దేశంలో ఎక్కడెక్కడున్నా పట్టుకొని జైళ్లకు తరలించారు. అయినా కొన్ని ప్రాంతాల్లో సైబర్‌ నేరగాళ్లు విసురుతున్న వలలకు చిక్కుతూనే ఉన్నారు. 
 
తాజాగా వీరి మోసానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. అప్పులు ఎక్కువై ఓ వ్యక్తి కుటుంబ సభ్యులకు వీడియో కాల్‌ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిల్లలు వద్దు నాన్న అంటూ వేడుకుంటున్నా, చలించకుండా ప్రాణాలు తీసుకున్న ఘటన కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది.
 
రామారెడ్డి మండలం పోసానిపేటకు చెందిన మంగళపల్లి లక్ష్మణ్‌ (42), లక్ష్మి దంపతులు. వారికి ఇద్దరు పిల్లలు. ఉపాధి కోసం గతంలోనే కామారెడ్డికి వలసొచ్చి అక్కడే దొరికిన పని చేసుకుంటూ జీవం సాగిస్తున్నారు. 
 
సాఫీగా సాగుతున్న వారి సంసారంలో నాలుగు నెలల క్రితం లక్ష్మికి సైబర్‌ నేరగాళ్ల నుంచి ఫోన్‌ వచ్చింది. మీరు లక్కీ డ్రాలో రూ.కోటి గెలుచుకున్నారని.. ఈ మొత్తం మీ సొంతం కావాలంటే అందుకు సంబంధించిన సర్వీస్‌ ఛార్జీలు చెల్లించాలని డబ్బు డిమాండ్‌ చేశారు. వారి మాటలకు మోసపోయిన దంపతులు వారికి విడతల వారీగా రూ.2.65 లక్షలు అకౌంట్‌లో వేశారు.
 
ఇప్పుడప్పుడంటూ కాలం వెల్లదీస్తూనే ఉన్నారు. ఎంతకీ డబ్బులు రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన భార్యభర్తలు పోలీసులను ఆశ్రయించారు. అయితే.. వారికి చెల్లించిన డబ్బులు అప్పుగా తీసుకున్నావి. రోజురోజుకు అప్పులు పెరగడం, అందరిలోనూ మోసపోయామని లక్ష్మణ్‌ మనోవేదనకు గురైతూ వచ్చాడు. ఇదే అతని ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు