నాన్నా.. అమ్మ ఎప్పుడు వస్తుంది? విజయారెడ్డి కుమార్తె

బుధవారం, 6 నవంబరు 2019 (12:48 IST)
తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిందని చెప్పలేని పరిస్థితి. చిన్న పిల్లలు తన తల్లి చనిపోయిందంటే ఎలా రియాక్టవుతారో తెలియక ఆ తండ్రి కుమిలిపోయాడు. తన భార్యను అతి కిరాతకంగా పెట్రోల్ పోసి నిప్పంటించారన్న విషయం తెలుసుకుని బోరున విలపించాడు. తహశీల్దార్ విజయారెడ్డి భర్త సుభాష్ రెడ్డి ప్రభుత్వ లెక్చరర్.
 
కళాశాలలో ఉన్న సుభాష్ రెడ్డికి రెవిన్యూ ఉద్యోగులు ఫోన్ చేశారు. మీ భార్యను ఎవరో చంపేశారంటూ చెప్పారు. దీంతో తీవ్రంగా కన్నీంటి పర్యాంతమయ్యాడు సుభాష్. స్థానిక ఉపాధ్యాయులు ఆయన్ను ఓదార్చారు. ఘటనా స్థలానికి వెళ్ళాడు. భార్య మృతదేహాన్ని చూసి చలించిపోయాడు. బోరున విలపించాడు.
 
ఇంటికెళ్ళి తన పిల్లలను మిద్దెపైన తన స్నేహితుని ఇంటికి పంపాడు. మీరు రాత్రికి ఇక్కడే పడుకోండి అన్నాడు. విజయారెడ్డి కుమార్తె నాన్న...అమ్మ ఎక్కడికి వెళ్ళింది.. ఎప్పుడు వస్తుందని అడిగింది. ఏం సమాధానం చెప్పాలో తెలియక బాధను దిగమింగుకున్నాడు సుభాష్. అమ్మ..ఉదయాన్నే వచ్చేస్తుంది నాన్న. ఏదో పనిమీద బయటకు వెళ్ళిందట అంటూ బుజ్జగించి వచ్చేశాడు. 
 
ఉదయాన్నే విజయారెడ్డి పార్థీవదేహాన్ని ఆమె నివాసముండే అపార్ట్ మెంట్ వద్దకు తీసుకొచ్చారు. మీ అమ్మ చనిపోయిందంటూ గట్టిగా ఏడుస్తూ తన కుమార్తెకు చెప్పాడు సుభాష్ రెడ్డి. తల్లి చనిపోయిందన్న విషయం కుమార్తెకు తెలుసు..కానీ కుమారుడు చిన్న వయస్సు. ఏం జరుగుతుందో అర్థం కాక తల్లి పార్థీవదేహం వద్ద కూర్చుని ఉండడం అందరినీ తీవ్రంగా కలచివేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు