భార్యను చంపేసి ఆమె శవం పక్కనే పడుకుని నిద్రపోయిన భర్త

గురువారం, 30 జనవరి 2020 (16:36 IST)
మనుషులు ఎంత పైశాచికంగా మారుతున్నారనడానికి మరో ఉదాహరణ ఇది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది.  శివార్లలోని లంగర్ హౌజ్‌లో ఉంటున్న ఎల్లప్ప ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఏడడుగులు నడిచి వందేళ్ళు కలిసి ఉండాల్సిన భార్యను అతి దారుణంగా నరికి చంపి ఆమె పక్కన పడుకుని నిద్రపోయాడు భర్త. 
 
లంగర్ హౌజ్ లోని మందుల బస్తీలో కొన్నేళ్లుగా ఎల్లప్ప, అమృతమ్మ దంపతులు ఉంటున్నారు. ఎల్లప్ప రోజువారీ కూలి. రోజూ తాగొచ్చి ఇంట్లో గొడవ పడేవాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. కొన్నిసార్లు వివాదం పంచాయితీ వరకు కూడా వెళ్లిందట. అయితే నిన్న రాత్రి మాత్రం ఈ వ్యవహారం పెద్దదైంది.
 
ఆ తరువాత ఎప్పటిలాగానే ఎల్లప్ప కూడా తాగి ఇంటికొచ్చాడు. భార్యతో గొడవ పడ్డాడు. కానీ వివాదం అక్కడితో ఆగలేదు. తాగిన మైకంలో అమృతమ్మ గొంతు నులిమేశాడు. ఇంట్లో ఉన్న చిన్న గ్యాస్ సిలిండర్ తీసుకొని ఆమె తలపై కొట్టాడు. దీంతో అక్కడికక్కడే ఆమె మరణించింది.
 
అప్పటికీ ఎల్లప్పకు తాగిన మత్తు దిగలేదు. ఆమె మృతదేహం పక్కనే రాత్రంతా పడుకున్నాడు. పొద్దున్న తాగినదంతా దిగిన తర్వాత తాపీగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు