గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికలు కురక్షేత్రం వంటివి : ఈటల రాజేందర్

గురువారం, 26 అక్టోబరు 2023 (16:28 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, గజ్వేల్‌ అసెంబ్లీ స్థానం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారు. అలాగే, భారతీయ జనతా పార్టీ నుంచి ఒకప్పటి తెరాస నేత, మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. దీంతో గజ్వేల్ అసెంబ్లీ స్థానం పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో గురువారం గజ్వేల్‌కు ఈటల రాజేందర్ వెళ్లారు. వర్గల్ సరస్వతీదేవి ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గజ్వేల్‌లో ఎన్నికలు కురక్షేత్రం యుద్ధం వంటిదన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. పైగా, హుజురాబాద్‌ ఉప ఎన్నికల సమయంలో జరిగిందే ఇపుడు గజ్వేల్‌లోనూ జరుగుతుందన్నారు. 
 
బీఆర్ఎస్ ఎన్నికుయుక్తులు, కుట్రలు చేసినా గెలిచేది బీజేపీయే అన్నారు. గజ్వేల్‌లో ఏ పార్టీ అయినా సమావేశాలు పెట్టుకోవచ్చని, కానీ బీజేపీ సమావేశాలకు ప్రజలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. డబ్బులిచ్చి బీజేపీ సభకు రాకుండా చేస్తున్నారన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ ఇలాగే చేశారన్నారు. కానీ, వారు ప్రలోభాలకు లొంగకుండా ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టారన్నారు. ఈసారి గజ్వేల్‌లో అదే జరుగుతుందన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు