'గ్రేటర్' పోరు ముగిసింది... ఎవరికెన్ని స్థానాలంటే... మేయర్ పీఠం ఎంఐఎంకా?

శనివారం, 5 డిశెంబరు 2020 (09:07 IST)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగిశాయి. డిసెంబరు ఒకటో తేదీన ఓటింగ్ జరిగింది. ఈ ఓట్ల లెక్కింపు శుక్రవారం చేపట్టారు. మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించగా, 149 డివిజన్లకు శుక్రవారం ఓట్లు లెక్కించారు. నేరేడ్ మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపును పెండింగ్‌లో పెట్టారు. 
 
అక్కడ స్వస్తిక్ ముద్రతో పడిన ఓట్ల కంటే వేరే ముద్రతో పడిన ఓట్ల మెజారిటీ ఎక్కువగా ఉండడంతో హైకోర్టు ఆదేశాల మేరకు లెక్కింపు నిలిపివేశారు. ఇక, ఫలితాలు చూస్తే, అధికార తెరాస 55 డివిజన్లలో విజయం సాధించడం ద్వారా అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2016 ఎన్నికలతో పోల్చితే టీఆర్ఎస్‌కు ఇవి చేదు ఫలితాలు.
 
ఇకపోతే, తెరాసకు గట్టిపోటీ ఇచ్చిన బీజేపీ 48 డివిజన్లు కైవసం చేసుకోవడం ఈసారి ఎన్నికల్లో హైలైట్ అని చెప్పవచ్చు. ఎప్పట్లాగే ఎంఐఎం తన హవా చాటుకుంటూ 44 డివిజన్లలో జయకేతనం ఎగురవేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతిన్నది. హస్తం పార్టీకి కేవలం 2 డివిజన్లలో తప్ప ప్రతిచోటా నిరాదరణే ఎదురైంది.
 
అసలు విషయానికొస్తే... జీహెచ్ఎంసీలో ఈసారి హంగ్ తప్పదని తేలిపోయింది. మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకు మ్యాజిక్ ఫిగర్ 76 సీట్లు కాగా, ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ఆ మార్కు చేరుకోలేకపోయింది. దాంతో మేయర్ పదవి కోసం ఎంఐఎం మద్దతు కీలకం కానుంది. బీజేపీ... ఎంఐఎం మద్దతు కోరే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, ఎంఐఎం కలుస్తాయా అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు