పెళ్లి చేసుకోమంటే పథకం ప్రకారం మట్టుబెట్టాడు

బుధవారం, 4 ఆగస్టు 2021 (09:44 IST)
హైదరాబాద్ నగరంలో ఓ యువకుడు తాను ప్రేమించిన బాలికను దారుణంగా హత్య చేశాడు. పెళ్లి చేసుకోమన్నందుకు పథకం ప్రకారం ఈ హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అల్వాల్‌ల పరిధిలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పాత అల్వాల్‌ పరిధిలో నివసించే దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమార్తెకు పెళ్లి చేయగా, రెండో కూతురు(17) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంటర్‌ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షల సమయంలో భూదేవి నగర్‌కు చెందిన దీపక్‌(20)తో ప్రేమ ఏర్పడింది. 
 
కొన్ని నెలలుగా బాలిక పెళ్లి ప్రస్తావన తెస్తుండటంతో ఆమె ఫోను నంబరు బ్లాక్‌ చేశాడు. అతడితో మాట్లాడాలని సోమవారం ఉదయం స్నేహితుల ద్వారా తాము తరచూ కలుసుకునే బీహెచ్‌ఈఎల్‌ కాలనీ సమీపంలోని ప్రాంతానికి రావాలని సూచించింది. అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటుండగా పెళ్లి ప్రస్తావన రావడంతో ఘర్షణ పడ్డారు. 
 
అప్పటికే ఆమెను వదిలించుకోవాలని ఉన్న దీపక్‌.. చున్నీతో బాలికకు ఉరి వేసి పరారయ్యాడు. కుమార్తె ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం తెల్లవారుజామున పోలీసులు నిందితుడిని సికింద్రాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. 
 
అతనిచ్చిన సమాచారంతో హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్వచ్ఛ ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాత్రి అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు