చేతులు కలిపి.. స్వరం పెంచిన కొండా : కేటీఆర్‌కు ఆ అర్హత లేదు

సోమవారం, 10 మే 2021 (15:58 IST)
తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు లేనే లేవని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఆయన ఇటీవల మంత్రిపదవిని కోల్పోయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిశారు. వీరిద్దరూ మంతనాలు జరిపారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రానికి సీఎం అయ్యే అర్హత కేవలం ఇద్దరికి మాత్రమే ఉందని... వారు హరీశ్ రావు, ఈటల రాజేందర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డికి కూడా కొంత వరకు ఆ అర్హత ఉందని అన్నారు. 
 
వ్యక్తిగతంగా చూస్తే కేటీఆర్ చాలా మంచి వ్యక్తి అని... అయితే ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు మాత్రం ఆయన సరైన వ్యక్తి కాదని చెప్పారు. తెరాస నాయకులతో తనకు ఎలాంటి బేదాభిప్రాయాలు లేవని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. 
 
అదేసమయంలో కాంగ్రెస్ పార్టీలో తనకు శత్రువులు ఎవరూ లేరన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలహీనపడిందని... అధికార తెరాసను ఎదుర్కోకలేకపోతోందని, అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చానని అన్నారు. ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి మానికం ఠాగూర్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు వివరించానని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు