వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేయండి: అధికారులకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశం

సోమవారం, 2 నవంబరు 2020 (07:26 IST)
కరోనా వైరస్ పై ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై  వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, కరోనాపై  ఏర్పాటు అయిన నిపుణుల కమిటీ తో సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిణామాలపై చర్చించారు.

అమెరికా, యూరప్ దేశాలలో కేసులు పెరుగుతున్న తీరు, భారతదేశంలో ఢిల్లీ, కేరళలో కేసులు పెరుగుతున్న తీరుపై నిశితంగా పరిశీలన జరిపారు. మన రాష్ట్రంలో కూడా బతుకమ్మ మొదలుకొని దసరా పండుగ వరకు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో బయటికి వచ్చిన  నేపథ్యంలో కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ అంచనాలు వేస్తోంది. 

వీటితోపాటుగా చలికాలం కావడంతో వైరస్ తీవ్రత పెరుగుతుందనే అభిప్రాయం కూడా ఉన్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలకు అందించాల్సిన సూచనపై సుదీర్ఘంగా చర్చించారు. 

అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భౌగోళిక పరిస్థితులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వైద్య ఆరోగ్య శాఖ మొదటి నుంచి ప్రణాళిక బద్ధంగా వ్యవహరించడం వల్ల కేసుల సంఖ్య పూర్తిస్థాయిలో అదుపులో ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాబోయే రోజుల్లో కూడా అదుపులోనే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
 
ఈసారి వర్షాలు ఎక్కువగా పడటం వల్ల తెలంగాణలో భూగర్భ జలాలు పెరగడం వల్ల చలి తీవ్రత అంతగా ఉండకపోవచ్చని అంచనాలు వేస్తున్నారు.  దీనితో వైరస్ ఉదృత కూడా ఎక్కువగా ఉండకపోవచ్చని అనుకుంటున్నారు.

అయినా సరే ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి తాము వైరస్ బారిన పడకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలని,  అదేవిధంగా ఇతరులను కూడా వైరస్ బారినపడకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు. మాస్కులు,  సోషల్ డిస్టెన్స్  తప్పనిసరిగా పాటించాలని కోరారు. 
 
ప్రభుత్వ పరంగా ఇప్పటికే కరోనా వైరస్ ని ఎదుర్కొనేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.  అని ఆసుపత్రులలో పూర్తిస్థాయిలో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. 

ఈ రోజు జరిగిన సమీక్ష సమావేశంలో ప్రస్తుతమున్న వసతులు, బెడ్ సంఖ్య, ఆక్సిజన్ సరఫరా, మందులు సరఫరా, సిబ్బంది పై కూలంకషంగా చర్చించారు. ఎక్కడా కూడా కొరత లేకుండా చూడాలని ఆదేశాలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాలు జారీ చేశారు.
 
ఇతర దేశాలలో కేసులు పెరుగుతున్న నేపద్యంలో మన రాష్టంలో ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉండాలి అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఈరోజు మంత్రి ఆదేశించారు. 
 
ప్రపంచంలోని వివిధ దేశాల్లో వ్యాక్సిన్ పై జరుగుతున్న పరిశోధనల క్రమాన్ని,  భారతదేశంలో కరోనా వాక్సిన్ పై జరుగుతున్న పరిశోధనల ఫలితాల పై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు వాక్సిన్ ఎప్పుడు వచ్చినా రాష్ట్రంలో  ప్రతి ఒక్కరికి అందించే విధంగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని కూడా ఈ రోజు మంత్రి ఆదేశించారు. 

ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించడం వల్ల గతంలో కంటే సీజనల్ వ్యాధుల సంఖ్య గణనీయంగా తగ్గింది.  ఈ కాలంలో వచ్చే కమ్యూనికబుల్ డెసీజ్ ల సంఖ్య కూడా పెరగలేదని అధికారులు మంత్రికి వివరించారు. అయితే అధిక వర్షాల వల్ల నీరు ఎక్కువగా కలుషితం అయ్యింది కాబట్టి డయేరియాలాంటి జబ్బులు  రాకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 

నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మలేరియా, డెంగ్యూ వంటి జబ్బులు రాకుండా ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  చలికాలంలో వచ్చే స్వైన్ ఫ్లూ లాంటి వాటి పట్ల కూడా జాగ్రత్త వహించాలని కోరారు.  వర్షం నిల్వలు లేకుండా చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పట్టణాలలో మున్సిపల్ శాఖ అధికారులతో, గ్రామాలలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఈటల రాజేందర్  కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు