లాక్డౌన్‌తో రోడ్డునపడిన ప్రిన్స్‌పాల్... తోపుడు బండిపై ఇడ్లీలు అమ్ముకుంటూ...

సోమవారం, 22 జూన్ 2020 (07:52 IST)
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే నిమిత్తం దేశంలో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. దీనికారణంగా అనేక మంది ఉపాధిని కల్పోయారు. ముఖ్యంగా, పాఠశాలలు మూతపడటంతో ఉపాధ్యాయులు రోడ్డునపడ్డారు. ఇలాంటి వారంతా తోపుడు బండ్లపై పండ్లు, పూలు అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నారు. 
 
తాజాగా తెలంగాణలోని ఖమ్మం పట్టణంలో నిన్నటివరకు స్కూల్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరించిన ఓ వ్యక్తి లాక్డౌన్ కారణంగా ఉపాధి పోవడంతో చేసేది లేక ఓ తోపుడు బండిపై టిఫిన్లు విక్రయించుకుంటూ బతుకుతున్నారు. భార్య సాయంతో ఇడ్లీ, దోసె, వడ వంటి అల్పాహారాలు అమ్ముకుంటూ ఆ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
 
ఆయన పేరు మార్గాని రాంబాబు. ఖమ్మంలోని మిల్లీనియం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్‌గా నెలకు రూ.22 వేలు జీతం అందుకుంటూ వచ్చారు. అయితే, లాక్డౌన్ దెబ్బకు స్కూలు మూతపడటంతో ఇంటికే పరిమితమయ్యారు. స్కూలు యాజమాన్యం జీతాలు ఇవ్వలేమని చేతులెత్తేయడంతో రాంబాబు దిగాలు పడ్డాడు.
 
అయితే లాక్డౌన్ సడలింపులు మొదలయ్యాక రూ.2000తో ఓ తోపుడు బండి కొనుక్కుని, దానిపై ఇడ్లీలు, వడలు, దోసెలు అమ్ముకుంటూ ఉపాధి పొందుతున్నాడు. రోజుకు కనీసం రూ.200 వస్తున్నాయని, దాంతో తన ఇద్దరు పిల్లలను, తల్లిని పోషించుకుంటున్నానని రాంబాబు తెలిపాడు. మరికొంతమంది ఉపాధ్యాయులు తమకు తోచిన పనులు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు