వచ్చేవారం రోడ్డెక్కనున్న ఏపీ, తెలంగాణ ఆర్టీసీ బస్సులు

శుక్రవారం, 19 జూన్ 2020 (10:40 IST)
కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన బస్సు సేవలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో బస్సులు రోడ్లపైకి రానున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ మధ్య వచ్చే వారం నుంచి బస్సులు నడిపేందుకు రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. కిలోమీటర్ల ప్రాతిపదికన బస్సులు నడిపేందుకు నిర్ణయించారు. 
 
మొత్తం నాలుగు దశల్లో సర్వీసులను అమల్లోకి తేనున్నారు. ఇందులో భాగంగా తొలి దశలో వచ్చే వారం నుంచి 256 బస్సులు నడపనున్నట్టు ఏపీ అధికారులు ప్రకటించారు. తెలంగాణ ఆర్టీసీ అధికారులు మాత్రం దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
 
గురువారం విజయవాడలో ఇంటర్ స్టేట్ బస్సు సర్వీసులపై రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఏపీతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోలేదు. ఈ విషయం కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది.
 
ప్రస్తుతం తెలంగాణ కంటే ఏపీ బస్సులు ఎక్కువ కిలోమీటర్లు తిరుగుతున్నాయి. తెలంగాణలో ఏపీ బస్సులు 3 లక్షల కిలోమీటర్లు తిరుగుతుంటే, తెలంగాణ బస్సులు ఏపీలో 1.5 లక్షల కిలోమీటర్లు మాత్రమే నడుస్తున్నాయి. దీంతో ఆదాయం రావడం లేదని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. 
 
అంతర్రాష్ట్ర నిబంధనల ప్రకారం ఒప్పందం చేసుకునేందుకు రెండు రాష్ట్రాలు ప్రాథమికంగా అంగీకరీంచినట్లు సమాచారం. ఏపీ బస్సులు ఎక్కువగా తిరగకుండా ''సమన్యాయం పద్ధతి''న బస్సులు నడపాలని నిర్ణయించారు. ఈ నెల23న హైదరాబాద్ బస్ భవన్‌లో రెండు రాష్ట్రాల ఎండీలు సమావేశమై చర్చించి, తుది నిర్ణయం తీసుకోనున్నారు. అదే రోజు అన్నింటిపై స్పష్టత రానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు