తనకు న్యాయం చేయాలని కూతురితో కలిసి తల్లి భిక్షాటన

సోమవారం, 14 సెప్టెంబరు 2020 (18:02 IST)
తనకు జరిగన అన్యాయాన్ని నిరసిస్తూ ఓ తల్లి తన కన్న కూతురితో కలిసి భిక్షాటన చేసింది. ఆర్మీ ఉద్యోగం చేస్తూ భర్త పట్టించుకోకపోగా తన పేరిట ఉన్న భూమిని అత్త, బావలు అక్రమంగా పట్టా చేసుకున్నారు. అది సహించలేని ఆ మహిళ ఏంచేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిల్లో భిక్షాటన చేస్తూ నిరసన చేసింది.
 
ఆ తర్వాత గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు తన కూతురితో ధర్నా చేసింది. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లెలో చోటుచేసుకున్నది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. 15 ఏళ్ల క్రితం తీగరాజు పల్లె గ్రామానికి చెందిన రంరాజు అమరావతికి, మదుసూదన్‌కు వివాహం జరిగింది.
 
అయితే సదరు మహిళ తన భర్త, బావ, ఆడబిడ్డలపై కుటుంబ కలహాలతో 2012లో హన్మకొండలోని మహిళా పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. దీంతో అక్కడి పోలీసులు వారందరి పైనా కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కేసు నడుస్తూనే ఉంది. ఓవైపు తను పెట్టిన కేసులు విచారణలో ఉండగానే అత్త, బావ రంగరాజ్ సదరు బాధితురాలు పేరు మీద ఉన్న భూమిని వారి పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
 
తర్వాత కొన్ని రోజులకే ఈ విషయం అమరావతికి తెలియడంతో వెంటనే ఆమె స్పందించి తనకు న్యాయం చేయాలంటూ తన కూతురితో కలిసి గ్రామంలో భిక్షాటన చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు