మునుగోడు ఉపపోరు : బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డికి చెప్పు దెబ్బ!

సోమవారం, 24 అక్టోబరు 2022 (11:13 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ఈ ప్రచారంలో పలు ఉద్రిక్త ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ మాజీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఒక కాంగ్రెస్ కార్యకర్త ఆయనపై చెప్పుతో దాడి చేసేందుకు యత్నించాడు. దీన్ని గమనించిన బీజేపీ నేతలు ఆ కార్యకర్తలను పక్కకు లాగేశారు. దీంతో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెప్పుదెబ్బ తప్పిపోయింది. 
 
కాగా, ఉప ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. పోటీలో ఉన్న మూడు ప్రధాన పార్టీలైన అధికార తెరాస, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు విజయం కోసం హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ ప్రచార పర్వం ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. పార్టీల నేతల మధ్య మాటల యుద్ధమేకాకుండా భౌతిక దాడులు కూడా చోటుచేసుకుంటున్నాయి. 
 
ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీంతో ఆమె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 
 
బీజేపీ శ్రేణులు చేసిన ఈ పనికి కాంగ్రెస్ శ్రేణులు కూడా ప్రతీకారం తీర్చుకునేందుకు యత్నించారు. అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా, ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆయనపై చెప్పుతో దాడి చేసేందుకు యత్నించారు. ఆయన ప్రచారం చేస్తున్న వాహనం ఎక్కిన చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించాడు. 
 
దీన్ని గమనించిన రాజగోపాల్ రెడ్డి వెనక్కి జరిగారు. ఆ వెంటనే బీజేపీ కార్యకర్తలు సదరు కాంగ్రెస్ కార్యకర్తను పక్కకు లాగిపడేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్నయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు