సంతానం కలగలేదని భార్యపై పెట్రోల్‌ పోసి, నిప్పంటించి..?

మంగళవారం, 23 మార్చి 2021 (22:11 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. సంతాన భాగ్యం కలగడం లేదని ఓ భర్త కిరాతకానికి తెగబడ్డాడు. ఆదమరచి నిద్రపోతున్న భార్యపై పెట్రోల్‌ పోసి, నిప్పంటించి మట్టుబెట్టాడు.ఈ ఘటన జిల్లా కేంద్రం శివారులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పట్టణ శివారు అక్కలాయిగూడేనికి చెందిన పరశురామ్‌ మున్సిపాలిటీలో జవాన్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి చిట్యాల మండలం తాళ్లవెల్లెంలకు చెందిన జ్యోతితో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 
 
వీరికి పిల్లలు పుట్టకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై భార్యాభర్తలపై ఆదివారం గొడవ జరిగింది. రాత్రి పూటుగా మద్యం తాగిన పరశురామ్‌ తెల్లవారుజామున నిద్దరోతున్న భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి పరారయ్యాడు. 
 
పరశురామ్‌ ఇంటినుంచి పొగ వస్తుండడంతో చుట్టు పక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్‌టౌన్‌ సీఐ సురేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకునేలోపే జ్యోతి మృతిచెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు