పత్తి చేనులో పురుగుల మందు తాగిన ఉపాధ్యాయుడు.. మృతి

సోమవారం, 5 అక్టోబరు 2020 (17:42 IST)
కరోనా కష్టాలు మరో యువ ఉపాధ్యాయుడి ప్రాణాలు తీశాయి. కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ ప్రకటించారు. ఇపుడు అన్‌లాక్ 5.0 కొనసాగుతోంది. అయినప్పటికీ పాఠశాలలు తెరుచుకోలేదు. లాక్డౌన్ కారణంగా ఉద్యోగం పోయింది. తమ పొలంలో వేసిన పత్తి ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా జాలుబారిపోయింది. దీంతో ఆర్థిక కష్టాలు వైపు, మరోవైపు, కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక ఆ ఉపాధ్యాయుడు పత్తి చేనులోనే పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన నల్గొండ జిల్లా మునుగోడు మండలం, గంగోరిగూడెంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన మర్రి వెంకట్‌ (30) అనే వ్యక్తి పీజీ చేసినా ఉద్యోగం రాకపోవడంతో నార్కట్‌పల్లిలోని లిటిల్‌ ప్లవర్‌ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏడు నెలలుగా పాఠశాలలు ప్రారంభంకాలేదు. దాంతో వేతనాలు రాక కుటుంబాన్ని పోషించుకోవడం భారంగా మారింది. 
 
కరోనాతో ఉన్న ఉద్యోగం కోల్పోవడంతో తన గ్రామంలోనే నాలుగెకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశాడు. ఈ నెలలో కురిసిన అకాల వర్షాలతో పంటంతా జాలుబారింది. దాంతో ఆశించిన మేరకు దిగుబడి వచ్చేటట్టు కన్పించలేదు. పైగా పంటసాగు కోసం చేసిన సుమారు రూ.3 లక్షల అప్పులు ఎలా తీర్చాలో, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక మనోవేదనకు గురయ్యాడు. 
 
ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున పత్తి చేను వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు చేను వద్దకు వెళ్లి చూసేసరికి మృతి చెందాడు. మృతుని తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు