బీమా డబ్బుకు ఆశపడిన ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య... ఎక్కడ?

మంగళవారం, 2 మార్చి 2021 (07:55 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో కట్టుకున్న భార్య అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. బీమా డబ్బు కోసం ఆశపడి.. కట్టుకున్న భర్తను తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని దామచర్ల మండలంలోని కొండ్రపోల్‌కు చెందిన దేవిరెడ్డి కోటిరెడ్డి అనే వ్యక్తి మృతదేహం వారం రోజుల క్రితం నార్కట్‌పల్లి - అద్దంకి రహదారి పక్కన కనిపించింది. ట్రాక్టర్ ఢీకొట్టడం వల్లే ఆయన మరణించాడని కుటుంబ సభ్యుల భావించారు. ఆ విధంగా భార్య కూడా ఇతరులను నమ్మించింది. 
 
అయితే, అంత్యక్రియల సమయంలో కోటిరెడ్డి శరీరంపై గాయాలను చూసిన మృతుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కోటిరెడ్డి భార్యను అదుపులోకి తీసుకుని విచారించడంతో బీమా దందా వెలుగులోకి వచ్చింది. బీమా డబ్బుల కోసం ప్రియుడితో కలిసి తానే చంపించినట్టు అంగీకరించింది. 
 
ఈ హత్యలో పాలుపంచుకున్న బీమా ఏజెంట్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు చెప్పింది విని పోలీసులు షాకయ్యారు. బీమా సొమ్ము కోసం గత మూడేళ్లలో ఐదారుగురిని హత్య చేసినట్టు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు