ఒకే రోజు 879 కేసులు.. తెలంగాణలో ఆర్టీసీ సేవలు స్టాప్

బుధవారం, 24 జూన్ 2020 (10:08 IST)
తెలంగాణలో ఆర్టీసీ బస్సు సర్వీసులను ఆపేశారు. ఇప్పటికే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య చర్చలు ప్రారంభం కావడంతో రెండు రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలు పునరుద్ధరిస్తారని అందరూ భావించారు. కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీవ్ర నిరాశ ఎదురైంది. నేడు జరగాల్సిన కీలక భేటీ వాయిదా పడింది.
 
కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ భేటీని వాయిదా వేస్తున్నట్లు రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఇప్పట్లో తిరిగి ప్రారంభం కావడం కష్టమేనని అధికారులు భావిస్తున్నారు. 
 
మరోవైపు హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ రోజురోజుకీ ఉగ్రరూపం దాలుస్తోంది. ఈ నేపథ్యంలో అంతరాష్ట్ర బస్సులను నడపడానికి సీఎం కేసీఆర్‌ అంగీకరించపోవచ్చని భావిస్తున్నారు. మొత్తానికి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఇప్పట్లో ప్రారంభం కావడం కష్టమని పలువురు అధికారులు పేర్కొంటున్నారు.  
 
మరోవైపు తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్‌ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9వేల మార్కును దాటేసింది. మంగళవారం తాజాగా 879 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 9553కు చేరుకుంది. 
 
వీటిలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 652 కేసులు, మేడ్చల్‌ జిల్లాలో 112, రంగారెడ్డి జిల్లాలో 62 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన 9వేలకు పైగా కేసుల్లో 4224 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 220 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రస్తుతం 5109మంది చికిత్సపొందుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు