విజృంభిస్తున్న కరోనా .. 8 వరకు బడులు బడులు బంద్?

గురువారం, 18 మార్చి 2021 (12:28 IST)
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన కొనసాగింపుపై తెలంగాణ సర్కారు తర్జనభర్జన పడుతోంది. స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్లలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో 8వ తరగతి వరకు ప్రత్యక్ష బోధనను నిలిపేసే అంశాన్ని ముమ్మరంగా పరిశీలిస్తోంది. 
 
ఈ విషయంలో రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ కూడా అసెంబ్లీలో ప్రకటించారు. ఈ లెక్కన 8వ తరగతి వరకు ప్రత్యక్ష బోధనను నిలిపివేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10 తరగతులకు ప్రభుత్వం ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించింది. 
 
6, 7, 8 తరగతులకు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ప్రత్యక్ష బోధనకు అనుమతి ఇచ్చింది. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు మాత్రం ప్రత్యక్ష బోధన చేపట్టవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రైవేటు యాజమాన్యాలు 6, 7, 8, 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన చేపడుతున్నాయి. ఇదే అదనుగా 85 శాతానికిపైగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకున్నాయి. 
 
మరోవైపు ప్రత్యక్ష బోధన కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులు, టీచర్లకు కరోనా సోకడంతో ప్రభుత్వం ఆలోచనల్లో పడింది. ఈ వారంలోనే కరోనా పాజిటివ్‌ వచ్చిన విద్యార్థులు, టీచర్ల సంఖ్య వందలకు చేరుకుంది.
 
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా మరోసారి వేగంగా విజృంభిస్తోంది. అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని ప్రస్తావించగా.. సీఎం కేసీఆర్‌ స్పందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. స్కూళ్లు కొనసాగించడంపై రెండుమూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు