రైతుల జీవితాలకు ఉరితాడుగా మారుతోంది : కాంగ్రెస్ నేతలు

శనివారం, 30 జనవరి 2021 (16:59 IST)
ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగే శుభకార్యాలకు ఉపయోగించే పసుపు.. దాన్ని పండించే రైతుల జీవితాలకు మాత్రం ఉరితాడుగా మారుతోందని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పసుపు పంటకు మద్దతు ధరతో పాటు పసుపు బోర్డును ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో రాజీవ్ రైతు భరోసా దీక్ష చేపట్టారు. శాసనమండలి సభ్యుడు జీవన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మధుయాస్కీ గౌడ్‌తో పాటు పలువురు నేతలు దీక్షలో కూర్చున్నారు.
 
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ, తాను ఎంపీగా విజయం సాధిస్తే రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారని, ఈ హామీని నిలబెట్టుకోవాలని కోరారు. దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పెట్టుబడిని పరిగణనలోకి తీసుకుని మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఆరేళ్ల క్రితం పసుపు పంటకు ఉన్న మద్దతు ధర ఇవాళ లేకపోవడం బాధాకరమన్నారు.
 
గతంలో ఎంపీగా ఉన్న కవిత ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ధర్మపురి అర్వింద్‌ పసుపు బోర్డు తెస్తామని, మద్దతు ధర కల్పిస్తామని రాతపూర్వక హామీ ఇచ్చారు. రెండేళ్లు గడుస్తున్నా ఆయన ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చలేదు. ఈ మేరకు బోర్డు ఏర్పాటు చేసి పసుపుకు మద్దతు ధర కల్పించేంత వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తూ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం కొనసాగిస్తుంది’’ అని జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు
 
‘‘నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతాంగమంతా పోరాడుతోంటే.. రైతులకు మొదట మద్దతు తెలిపిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ రాష్ట్ర రైతాంగాన్ని దగా చేస్తున్నారని మరో ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర రైతులకు, దేశ రైతాంగానికి తలమానికంగా ఉండే నిజామాబాద్‌, ఆర్మూర్‌ రైతులు నేడు కష్టాల కడలిలో మునిగిపోయారు. ప్రభుత్వం చేతిలో మోసపోయి రైతులు శవాలుగా మారుతుంటే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాన్న ఎంపీ అర్వింద్‌ హామీలు ఏమైపోయాయి’’ అని ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు