తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు పచ్చజెండా

శుక్రవారం, 17 జులై 2020 (16:21 IST)
తెలంగాణా రాష్ట్ర సచివాలయ భవనాలను కూల్చివేసేందుకు ఆ రాష్ట్ర హైకోర్టు పచ్చజెండా ఊపింది. తెలంగాణలో పాత సచివాలయం కూల్చివేసి వాటి స్థానంలో కొత్త సచివాలయం నిర్మించేందుకు కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. అయితే, సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దానిపై శుక్రవారం విచారణ చేపట్టింది. 
 
ఇరు వర్గాల వాదనలు ఆలకించిన కోర్టు భ‌వ‌నాల‌ కూల్చివేత‌కు ప‌ర్యావ‌ర‌ణ శాఖ అనుమ‌తి అవ‌స‌రం లేద‌ని తేల్చిచెప్పింది. రాష్ట్ర మంత్రి వ‌ర్గ నిర్ణ‌యాన్ని హైకోర్టు స‌మ‌ర్థించింది. కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ భ‌వ‌నాల కూల్చివేత ప‌నులు కొన‌సాగించాల‌ని ప్ర‌భుత్వానికి కోర్టు సూచించింది. 
 
భవనాల కూల్చివేతకు పర్యావరణ అనుమతి అవసరం లేదని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (పీసీబీ), స్టేట్‌ లెవల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ అథారిటీ (ఎస్‌ఈఐఏఏ) హైకోర్టుకు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం నోటీఫై చేసిన ‘నిర్మాణం- కూల్చివేత నిబంధనలు- 2016’ను పాటిస్తే సరిపోతుందని పేర్కొన్నాయి. 
 
అలాగే, కూల్చివేతలపై దాఖలైన అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరంలేదని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వివరణ ఇవ్వడంతో న్యాయస్థానం దానితో ఏకీభవించింది. దాంతో ఇప్పటివరకు ఏర్పడిన సందిగ్ధత వీడినట్టయింది. 
 
విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తమ వాదనలు వినిపిస్తూ... భవనాల కూల్చివేతకు కేంద్రం అనుమతి అవసరంలేదని, నూతనంగా నిర్మాణాలు చేపట్టడానికే కేంద్రం అనుమతులు అవసరమని కోర్టుకు తెలిపారు. కొత్త నిర్మాణం చేపట్టేముందు అన్ని అనుమతులు తీసుకుంటామన్నారు. సొలిసిటర్ జనరల్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ఆపై ప్రభుత్వ అనుకూల నిర్ణయం తీసుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు