కుమార్తెను లేపుకెళ్లాడనీ.. యువకుడి తండ్రిని చంపేసిన యువతి కుటుంబ సభ్యులు...

ఆదివారం, 1 నవంబరు 2020 (09:46 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. తమ కుమార్తెను లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నాడన్న అక్కసుతో యువతి తల్లిదండ్రులు యువకుడి తండ్రిపై దాడి చేసి చంపేశాడు. ఈ దారుణం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన‌ప‌ల్లి మండ‌లం స్తంభంప‌ల్లిలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన గౌత‌మి అనే యువతిని అదే ప్రాంతానికి చెందిన మ‌హేశ్ అనే యువ‌కుడు కొంత‌కాలంగా ప్రేమిస్తూ వచ్చాడు. ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలిసింది. దీంతో యువతి తల్లిదండ్రులు ఈ పెళ్లికి అంగీకరించలేదు. 
 
పైగా, గౌత‌మికి మ‌రో అబ్బాయితో వివాహం చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 28న ఆమెకు నిశ్చితార్థం జరుగగా, 27వ తేదీన‌ మ‌హేశ్ ఆమె తీసుకొని గ్రామం నుంచి పారిపోయాడు. దీంతో గౌత‌మి త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. 
 
అదే రోజు మ‌హేశ్ తండ్రి తునికి ల‌క్ష్మీనారాయ‌ణ‌(58)పై యువతి తల్లిదండ్రులు దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. ఆయనను క‌రీంన‌గ‌ర్‌లోని ఓ ప్ర‌ైవేటు ఆస్ప‌త్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా స్తంభంప‌ల్లిలో పోలీసులు భారీగా మోహ‌రించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు