సుమంత్ అశ్విన్‌, శ్రీ‌కాంత్‌, తాన్యా హోప్ చిత్రంలో జాయిన్ అయిన భూమిక‌

శుక్రవారం, 30 అక్టోబరు 2020 (19:46 IST)
నాలుగు పాత్ర‌ల చుట్టు న‌డిచే రోడ్ జ‌ర్నీ కాన్సెప్ట్‌తో గుర‌ప్ప ప‌ర‌మేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై జి.మ‌హేష్ నిర్మిస్తోన్న తొలి చిత్రంలో అభిన‌యానికి అవ‌కాశం ఉన్న ఒక ప్ర‌ధాన పాత్ర‌కు చిత్ర బృందం భూమిక‌ను ఎంపిక చేశారు. మిగ‌తా మూడు ప్ర‌ధాన పాత్ర‌ల‌ను సుమంత్ అశ్విన్‌, శ్రీ‌కాంత్‌, తాన్యా హోప్ చేస్తున్నారు. లాక్డౌన్ త‌ర్వాత గురువారం పునఃప్రారంభ‌మైన షూటింగ్‌లో ఆమె జాయిన్ అయ్యారు. గురుప‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ చిత్ర క‌థ‌ ప్ర‌ధానంగా నాలుగు పాత్ర‌ల చుట్టూ న‌డుస్తుంది. ఆ నాలుగు పాత్ర‌ల‌ను సుమంత్ అశ్విన్‌, శ్రీ‌కాంత్‌, భూమిక‌, తాన్యా హోప్ చేస్తున్నారు.
 
లాక్డౌన్‌కు ముందుగానే ల‌డ‌ఖ్ షెడ్యూల్‌తో స‌హా 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో అన్ని ర‌కాల నిబంధ‌న‌లు పాటిస్తూ జ‌రుగుతోంది. న‌లుగురు ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు.
 
ఈ సంద‌ర్భంగా భూమిక మాట్లాడుతూ, "చాలా రోజు త‌ర్వాత నేను సినిమా సెట్స్‌పైకి వ‌చ్చాను. శానిటైజ్ చేసుకుంటూ, మాస్క్‌లు ధ‌రిస్తూ, త‌ర‌చూ చేతులు శుభ్రం చేసుకుంటూ, అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నాం. మీ అంద‌రి ప్రేమానురాగాల‌ను కోరుకుంటున్నాం. త్వ‌ర‌లో మీ అంద‌ర్నీ తెర‌పై క‌లుసుకుంటాం" అని చెప్పారు.
 
హీరో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ, "మ‌ళ్లీ ప‌ని మొద‌ల‌వ‌డం, సెట్స్‌పైకి రావ‌డం సంతోషంగా అనిపిస్తోంది. భూమిక, శ్రీ‌కాంత్‌తో ఈ సినిమాలో ప‌నిచేస్తున్నాను. అలాంటి వండ‌ర్‌ఫుల్ సీనియ‌ర్ యాక్ట‌ర్ల‌తో క‌లిసి ప‌నిచేయ‌డం గౌర‌వంగా భావిస్తున్నా. భూమిక అంటే నాకు నోస్టాల్జిక్ ఫీలింగ్‌. ఆమెతో క‌లిసి ప‌నిచేస్తున్నానంటే న‌మ్మ‌లేక‌పోతున్నాను. 
 
మొద‌టిసారి ఆమెను సెట్‌లో క‌లిసిన‌ప్పుడు నేను చిన్న‌వాడ్ని. ఆమెతో క‌లిసి ప‌నిచేస్తాన‌ని నేనెప్పుడూ ఊహించలేదు. ఇప్పుడు ఈ సినిమాకు ప‌నిచేస్తుంటే చాలా నోస్టాల్జిక్‌గా, గొప్ప‌గా అనిపిస్తోంది. ఇక శ్రీ‌కాంత్ ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయ‌నంటే నాకు చాలా గౌర‌వం. సినిమా షూటింగ్ బాగా జ‌రుగుతోంది" అన్నారు. 
 
హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ, "ఏడు నెల‌ల త‌ర్వాత మ‌ళ్లీ షూటింగ్‌కు రావ‌డం హ్యాపీగా ఉంది. క‌రోనా వ‌చ్చి అన్ని రంగాలు దెబ్బ‌తిన్న‌ట్లే ఫిల్మ్ ఇండ‌స్ట్రీ కూడా స‌మ‌స్య‌లు ఎదుర్కొంది. ఇప్పుడు థియేట‌ర్లు ఓపెన్ కాక‌పోయినా సినిమాల షూటింగ్‌లు మొద‌ల‌య్యాయి. అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ధైర్యంగా షూటింగ్ చేస్తున్నాం. ఒక డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీస్తున్నారు. రోడ్ మూవీ. త్వ‌ర‌లో థియేట‌ర్లు కూడా తెరుచుకొని సినిమా ఇండ‌స్ట్రీ ప‌రిస్థితి మెరుగ‌వ్వాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.
 
హీరోయిన్ తాన్యా హోప్ మాట్లాడుతూ, "లాక్డౌన్ త‌ర్వాత నేను షూటింగ్‌లో పాల్గొంటున్న ఫ‌స్ట్ ఫిల్మ్ ఇదే. భూమిక, శ్రీ‌కాంత్‌, సుమంత్ అశ్విన్‌తో క‌లిసి న‌టిస్తున్నందుకు ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. ఇది బైక్ రైడింగ్ మూవీ. డైరెక్ట‌ర్ గురుప‌వ‌న్ చాలా బాగా తీస్తున్నారు" అన్నారు.
 
నిర్మాత జి.మ‌హేష్ మాట్లాడుతూ, "ఒక రోడ్ ట్రిప్ నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ న‌డుస్తుంది. ద‌ర్శ‌కుడు గురుప‌వ‌న్ స‌మ‌కూర్చిన స్క్రీన్‌ప్లే హైలైట్ అవుతుంది. ప‌ర్ఫార్మెన్స్‌కు బాగా స్కోప్ ఉన్న ప్ర‌ధాన పాత్ర‌కు వంద శాతం న్యాయం చెయ్య‌గ‌ల‌ర‌నే ఉద్దేశంతో భూమికని ఆ పాత్ర‌కు తీసుకున్నాం. ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని పాత్ర‌ల్లో సుమంత్ అశ్విన్‌, శ్రీ‌కాంత్ క‌నిపిస్తారు. అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు పాటిస్తూ షూటింగ్ నిర్వ‌హిస్తున్నాం" అని తెలిపారు.
 
స‌ప్త‌గిరి, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, పృథ్వీ ఇత‌ర కీల‌క పాత్ర‌ధారులు. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్ర‌సాద్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. 
 
తారాగ‌ణం:
సుమంత్ అశ్విన్‌, శ్రీ‌కాంత్‌, భూమిక‌, తాన్యా హోప్‌, స‌ప్త‌గిరి, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, పృథ్వీ. 
 
సాంకేతిక బృందం: క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గురుప‌వ‌న్‌, నిర్మాత‌: జి. మ‌హేష్‌, స‌మ‌ర్ప‌ణ‌: శ్రీ‌మ‌తి మ‌నోర‌మ గుర‌ప్ప‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: చిరంజీవి ఎల్‌., సినిమాటోగ్ర‌ఫీ: సి. రామ్‌ప్ర‌సాద్‌, మ్యూజిక్‌: సునీల్ క‌శ్య‌ప్‌, ఎడిటింగ్‌: జునైద్ సిద్దిఖి, ఫైట్స్‌: పృథ్వీరాజ్‌, పీఆర్వో: వంసశీ-శేఖ‌ర్‌. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు