2 తులాల బంగారం కోసం గొంతు కోసేశారు... ఎక్కడ?

సోమవారం, 12 ఏప్రియల్ 2021 (09:28 IST)
తెలంగాణా రాష్ట్రంలో రెండు తులాల బంగారం కోసం కొందరు దుండగులు గొంతు కోసేశారు. ఈ దారుణం రాష్ట్రంలోని మోర్తాడ్‌ మండల కేంద్రంలో గత నెల 27వతేదీన జరిగింది. ఈ హత్యపై పోలీసులు విచారణ చేపట్టి అసలు విషయాన్ని వెల్లడించారు 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గత నెల 27వ తేదీన గద్దరాజు సత్యవ్వ(40)ను బంగారం కోసం హత్య చేసినట్లు డీసీపీ రఘువీర్‌ తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన ప్రధాన నిందితుడు పల్లపు మల్లేశ్‌ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఇతడిపై అంతకు ముందే 17 కేసులు ఉన్నాయి. గంజాయి విక్రయిస్తున్న సమయంలో కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చందాపూర్‌కు చెందిన సత్యవ్వతో పరిచయం ఏర్పడింది.
 
మల్లేశ్‌ ఆమె వద్ద ఉన్న రెండు తులాల బంగారాన్ని ఎలాగైనా దొంగలించాలని హరికృష్ణ సహాయం కోరాడు. ఇద్దరూ కలిసి ఓ కారును అద్దెకు తీసుకొన్నారు. గత నెల 26న మద్యం కొనుగోలు చేసి కామారెడ్డి పట్టణంలో సత్యవ్వను ఎక్కించుకొని జంగంపల్లి వైపు వెళ్లారు. 
 
శివారులో ముగ్గురూ మద్యం తాగారు. అక్కడే ఆమెను చంపాలని నిర్ణయించుకున్నా వీలుకాలేదు. అనంతరం మేడ్చల్‌ వెళ్లి ఓ లాడ్జిలో రూం తీసుకోవాలనుకున్నారు. లాడ్జి యజమాని ఆధార్‌కార్డులు అడిగాడు. వారివద్ద లేకపోవడంతో కామారెడ్డికి తిరుగు పయనమయ్యారు.
 
కామారెడ్డి మధ్యలో ఉన్న అటవీ ప్రాంతంలో మల్లేశ్‌ మద్యం సీసాతో సత్యవ్వ గొంతు కోశాడు. అనంతరం చీరను మెడకు బిగించడంతో కారులోనే మృతి చెందింది. బంగారం తీసుకున్న తర్వాత ఆమె మృతదేహాన్ని మోర్తాడ్‌ శివారులోని 63వ జాతీయ రహదారి పక్కన పడేసి పారిపోయారు. 
 
మొదట గుర్తు తెలియని మహిళ హత్యగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు అనంతరం నిందితులను పట్టుకొని వారి వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ రఘు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పడి దర్యాప్తును ముమ్మరం చేసి కేసును ఛేదించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు