తెలంగాణాలో శుభసూచకం.. అయినా మే 7 వరకు లాక్‌డౌన్

మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (10:15 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గతంలో రోజుకు 50కి పైగా నమోదు కాగా, ఇపుడు కేవలం పది లేదా పదిలోపు మాత్రమే నమోదవుతున్నాయి. అందువల్ల త్వరలోనే కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, లాక్‌డౌన్‌కు ముందు.. లాక్‌డౌన్ తర్వాత అని పోల్చుకుంటే. లాక్‌డౌన్ కాలంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయన్నారు. అయనప్పటికీ.. మే ఏడో తేదీ వరకు ఏ ఒక్కరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే, కరోనా వైరస్ చివరి లింకు వరకు పరీక్షలు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 
 
కాగా, ప్రస్తుతం తెలంగాణాలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్యం 1003గా ఉండగా, 332 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 646 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అంతేకాకుండా, ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా 10 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఆయన చెప్పారు. 
 
అంతేకాకుండా, సోమవారం 159 మందికి పరీక్షలు నిర్వహించగా, కేవలం ఇద్దరికే పాజిటివ్‌ వచ్చిందని.. మంగళవారంనాటికి 21 జిల్లాలు కరోనా యాక్టివ్‌ కేసులు లేని జిల్లాలుగా మారుతున్నాయని ప్రకటించారు. లాక్‌డౌన్‌ అమలుతో వైరస్‌ వ్యాప్తిని అరికట్టగలిగామని, మే ఏడోతేదీ వరకు లాక్‌డౌన్‌ యధావిధిగా కొనసాగుతుందని స్పష్టంచేశారు.
 
ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మనకు శుభసూచకమన్నారు. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగినపక్షంలో అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్రం కరోనా రహిత రాష్ట్రంగా అవతరిస్తుందని సీఎం కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు