ఆభాగ్యురాలిపై మృగాళ్ళదాడి.. మూడుసార్లు గర్భందాల్చింది...

సోమవారం, 8 మార్చి 2021 (12:27 IST)
తెలంగాణా రాష్ట్రంలోని కోస్గిలో ఓ అభాగ్యురాలిపై గుర్తుతెలియని మృగాళ్లు లైంగికదాడికి తెగబడ్డారు. దీంతో ఆ యువతి మూడుసార్లు గర్భందాల్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కోస్గికి చెందిన ఓ యువతికి అమ్మానాన్నా చనిపోయారు. ఆదుకోవాల్సిన తోడబుట్టిన అన్న తనదారి తను చూసుకున్నాడు. దీంతో ఆ యువతి ఆసరాను కోల్పోయింది. కడుపునింపుకునేందుకు బిచ్చమెత్తుతూ రోడ్లపైనే సంచరించేది. 
 
అలాంటి మహిళను ఆదుకోవాల్సిన సమాజం వక్రబుద్ధి చూపింది. కొందరు మృగాళ్లు లైంగికదాడులు చేయడంతో అభాగ్యురాలు ఇప్పటికి ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. ఇంత జరుగుతున్నా, అధికారులు చోద్యం చూస్తున్నారు. నిందితులెవరో గుర్తించే ప్రయత్నం లేదు. 
 
బాధితురాలిని ఆదుకోనూలేదు. నారాయణపేట జిల్లాలోని కోస్గి పట్టణానికి చెందిన ఆ మహిళ ఆదివారం మూడోబిడ్డను ప్రసవించింది. బస్టాండ్‌ దగ్గర పెట్రోల్‌బంకు వెనుక నిర్మాణంలో ఉన్న భవనంలో ఆమెకు నొప్పులు రావడంతో స్థానికులు ప్రభుత్వ వైద్యురాలిని రప్పించి, ప్రసవం చేయించారు. 
 
ఆడబిడ్డ పుట్టింది. వెంటనే తల్లి అక్కడి నుంచి వెళ్లిపోయింది. పసికందును అంగన్‌వాడీ సిబ్బంది మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని శిశుగృహకు అప్పగించారు. ఇంతకుముందు పుట్టిన ఇద్దరు బిడ్డలనూ ఇలాగే శిశుగృహ సంరక్షణకు పంపారు. ఇప్పటికైనా బాధిత మహిళకు అధికారులు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు