#InternationalWomensDay : అతివతోనే అభివృద్ధి.... కేసీఆర్ - జగన్

సోమవారం, 8 మార్చి 2021 (09:25 IST)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి మహిళాలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో మహిళలది అత్యంత కీలక పాత్ర అని చెప్పుకొచ్చారు.
 
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ,తెలంగాణ మహిళా సంక్షేమంలో ముందంజలో ఉన్నదన్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పోటీ పడుతూ మహిళలు ప్రతిభ చాటుతున్నారని కొనియాడారు. మహిళలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేసి చూపిస్తారని సీఎం అన్నా రు. 
 
మహిళల భద్రత కోసం షీటీమ్స్‌, వృద్ధ, ఒంట రి మహిళలు, వితంతు పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు వేతనాల పెంపు సహా మహిళా సాధికారతకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు  చేస్తున్నదని తెలిపారు. 
 
అలాగే, మంత్రులు సబితా, గంగుల కమలాకర్‌ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్యర్వంలో హైటెక్స్‌లో నిర్వహించిన  ఏ బిజినెస్‌ ఐడియా ఎంట్రప్రెన్యూర్స్‌ కార్యక్రమంలో మంత్రి గంగుల పాల్గొన్నారు. 
 
మరోవైపు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 8) మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినంగా ప్రకటించినట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. 
 
ఇదిలావుంటే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని కొనియాడారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. వైకాపా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొచ్చిందని సీఎం జగన్‌ గుర్తు చేశారు. 
 
అమ్మ ఒడి, వైఎస్‌ఆర్‌ చేయూత, ఆసరా, కాపునేస్తం పథకాలు తెచ్చామన్నారు. మహిళల పేరుతో ఇంటిపట్టాలు ఇచ్చామన్నారు. సంపూర్ణ పోషణతోపాటు నామినేటెడ్‌ పోస్టు్ల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించామని చెప్పారు. దిశ చట్టం, కేసుల సత్వర విచారణకు ప్రత్యేక కోర్టులు తెచ్చామన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు