భార్య పుట్టింటికి వెళ్లిందనీ... చెట్టుకు ఉరేసుకున్న భర్త

సోమవారం, 8 మార్చి 2021 (12:08 IST)
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కట్టుకున్న భర్త ఇష్టానుసారంగా కల్లు తాగి మతిస్థిమితం కోల్పోవడాన్ని ఆ మహిళ తట్టుకోలేక పోయింది. దీంతో భర్తను వీడి పుట్టింటికి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న భర్త... మనోవేదనతో చెట్టుకు ఉరివేసుకున్నాడు. 
 
ఈ విషాదకర ఘటన తెలంగాణా రాష్ట్రంలోని మైలార్‌దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హసన్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ షఫీ(30) వృత్తిరీత్యా టాక్సీ డ్రైవర్‌. మూడేళ్ల క్రితం దుబాయ్‌కెళ్లాడు. కరోనా కష్టకాలంలో అక్కడే ఇరుక్కుపోయాడు. మూడునెలల క్రితం తిరిగొచ్చాడు. ఒంటరిగా ఉంటూ వేదనకు గురయ్యేవాడు. నిత్యం కల్లుకు తాగేవాడు. అప్పుడప్పుడూ పిచ్చిగా ప్రవర్తించేవాడు. ఇద్దరు కూతుళ్లున్నారు.
 
ఇలా చేస్తే ఎలా అంటూ భర్తను భార్య నిలదీసింది. అయినా ప్రవర్తనలో మార్పురాలేదు. దీంతో మూడు రోజుల కిందట కార్వాన్‌లోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఒంటరితనం వేధించడంతో ఆదివారం ఉదయం శివరాంపల్లి రాఘవేంద్రకాలనీకి చేరుకున్నాడు. 
 
ఆ ప్రాంతంలో అంతా ఉదయం వాకింగ్‌ పూర్తి చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. ఎవరూ లేనిది గుర్తించి అక్కడే ఓ చెట్టుకు వేలాడుతున్న వైరుతో గొంతుకు బిగించుకుని చెట్టుపైకెక్కి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. 
 
ఘటనా స్థలికి వెళ్లిన ఎస్సై ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు