వెంటిలేటర్ పైన ప్రియురాలికి తాళికట్టి ధైర్యం చెప్పిన ప్రియుడు, కానీ?

మంగళవారం, 1 జూన్ 2021 (17:38 IST)
కరోనా ఎన్నో బంధాలను బలితీసుకుంటోంది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగిలిస్తోంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువుకు చెందిన 27యేళ్ళ యువతి.. జీవితంపై ఎన్నో ఆశలు  పెట్టుకుంది. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తోంది. ఈ యేడాది చివరలో తను ప్రేమించిన యువకుడిని పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంది.
 
వీరి ప్రేమకు ఇరువర్గాల పెద్దలు అంగీకరించారు కూడా. ఇక పెళ్ళిపీటలు ఎక్కడమే ఆలస్యమనుకున్నారు అంతా. సాఫీగా సాగిపోతుందనుకున్న ఆమె జీవితం విషాదంగా మారింది. ఆమె కరోనా బారిన పడింది.
 
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. మూడేళ్ళుగా ఆ యువతిని ప్రేమిస్తున్న యువకుడు రోజూ ఆమెకు దైర్యం చెప్పేవాడు. ఆమెను బతికించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటిలేటర్ పైన ఉంచి చికిత్స అందించారు. 
 
దీంతో ఆమె ధైర్యం కోల్పోయింది. ఆమెలో ధైర్యం పెంచేందుకు చికిత్స పొందుతున్న ఆమె బెడ్ పైనే తాళికట్టాడు యువకుడు. క్షేమంగా ఇంటికి వస్తుందనుకున్నాడు. సంతోషంగా జీవిద్దామనుకున్న యువతి, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె సోదరుడు, ప్రేమించిన యువకుడు ఇద్దరూ కలిసి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. యువతి తల్లిదండ్రులకు కూడా కరోనా రావడంతో వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. కూతురు చనిపోయిందనే వార్త తల్లిదండ్రులకు ఇప్పటికీ తెలియదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు