ప్రధానికి రేవంత్ రెడ్డి లేఖ.. సింగరేణి కార్మికులు..?

శనివారం, 11 డిశెంబరు 2021 (15:39 IST)
తెలంగాణలోని సింగరేణి కాలరీస్‌కి చెందిన నాలుగు బొగ్గు గనుల బ్లాకులను వేలం వేయాలన్న కేంద్రం నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. బొగ్గు బ్లాకులను వేలం వేసే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు.
 
రెండు నెలల కిందట దేశంలోని పలు ప్రాంతాల్లో అనేక విద్యుత్ ప్లాంట్లు తీవ్రమైన బొగ్గు కొరతను ఎదుర్కొన్నప్పటికీ తెలంగాణలో అవసరాలకు తగ్గట్టుగా నిల్వలు ఉన్నాయని రేవంత్ పేర్కొన్నారు. 
 
సింగరేణి తగినంత బొగ్గు సరఫరా చేయడంతోనే అది సాధ్యమైందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్ అని చెప్పారు
 
కేంద్రం ఈ నెల 12న విడుదల చేసిన నోటిఫికేషన్ వాటాదారుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందన్నారు. తెలంగాణలో నైపుణ్యం కలిగిన, నైపుణ్యం లేని కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న ఏకైక ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి అని.. కార్మికులు ఆందోళనకు గురవుతున్నారని రేవంత్ తెలిపారు. కేంద్ర నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని అభ్యర్థిస్తున్నానని ప్రధానికి లేఖ రాశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు