కారు దారి తప్పింది... తొండలు గుడ్లుపెట్టని ఏరియాలో భూముల ధరలు పెరిగాయంటే.. రేవంత్

సోమవారం, 19 జులై 2021 (09:11 IST)
తెలంగాణ రాష్ట్రంలో కారు దారితప్పిందని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పైగా, తొండలు గుడ్లు పెట్టని రంగారెడ్డి, హైదరాబాద్ నగరాల్లో భూములు ధరలు పెరిగాయంటే కారణం మాజీ మంత్రి టి.దేవందర్ గౌడ్ పుణ్యమేనని ఆయన గుర్తుచేశారు. 
 
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తెరాస వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులోభాగంగా తెరాసను పతనం చేసే దిశగా వచ్చే వారందరినీ కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి, తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత, టీడీపీ మాజీ నేత దేవేందర్‌ గౌడ్‌‌ను రేవంత్ కలిశారు. దీంతో దేవేందర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరతారా అన్న ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.
 
దేవందర్ గౌడ్‌తో జరిగిన సమావేశంలో తెరాసను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి కోసం పరితపించిన వ్యక్తి దేవేందర్ గౌడ్ అని, ఆయన కుమారుడు వీరేందర్ తనకు మంచి మిత్రుడు అని రేవంత్ చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే, తెలంగాణలో కారు దారి తప్పిందని, దేవేందర్ గౌడ్ పాదయాత్రతోనే అనాడు కాంగ్రెస్ జలయజ్ఞం జరిగిందన్నారు. తొండలు గుడ్లు పెట్టని రంగారెడ్డి, హైదరాబాద్‌లో భూముల ధరలు పెరిగాయి అంటే కారణం దేవేందర్ గౌడ్ అని రేవంత్‌ గుర్తుచేశారు. 
 
తెరాస పాలనలో డబుల్ బెడ్ రూం, దళితులకు మూడెకరాల లాంటి సంక్షేమం పేదలకు దూరం అయ్యిందన్నారు. అందరం కలిసి తెలంగాణ భవిష్యత్ కార్యాచరణ కోసం పని చేస్తామని, కేసీఆర్ వ్యతిరేకుల పునరేకీకరణలో భాగంగా అందరినీ కలుస్తామన్నారు. తెలంగాణకు పట్టిన గులాబీ చీడ వదిలిస్తామని రేవంత్ హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు