బండి సంజయ్‌ను లాగు తడిసేలా కొడతాం: తెరాస ఎమ్మెల్యే వార్నింగ్

గురువారం, 7 జనవరి 2021 (12:27 IST)
తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌కు అధికార తెరాస పార్టీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సంజయ్‌కి నాలుక కోస్తామని, లాగు తడిసేలా కొడతామని హెచ్చరించారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బాగా పుంజుకున్న తర్వాత బీజేపీ నేతలు నోటికి పని చెప్పిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
వీటికి తెరాస ప్రజాప్రతినిధులు ధీటుగా సమాధానమిస్తున్నారు. ఇందులోభాగంగా బాల్కసుమన్ మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బట్టలు ఊడదీసి కొడతామని అన్నారు. రైతుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంటే... రైతులను నట్టేట ముంచే చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. 
 
ఢిల్లీలో చలికి వణుకుతూ రైతులు ఆందోళన చేస్తుంటే... చర్చల పేరిట కేంద్రం కాలయాపన చేస్తోందని అన్నారు. కేసీఆర్ చేసిన ఉద్యమం వల్లే తెలంగాణ వచ్చిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకావడం వల్లే బండి సంజయ్ బీజేపీ శాఖకు అధ్యక్షుడు అయ్యడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. 
 
 
కేసీఆర్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్న బీజేపీ నాయకులపై మహారాష్ట్రలోని శివసేన తరహాలో దాడి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ గుర్తిస్తున్నారని... కొంత ఆలస్యం అయినా అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. కేసీఆర్‌ని విమర్శిస్తే ఆయన సొంత గడ్డ కరీంనగర్ లోనే బండి సంజయ్‌ని బట్టలు ఊడదీసి కొడతామని బాల్క సుమన్ హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు