కాళ్లు చేతులు విరగ్గొట్టేస్తాం : తెరాస ఎమ్మెల్యే

మంగళవారం, 10 ఆగస్టు 2021 (16:54 IST)
తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అధికార తెరాస పార్టీ ఎమ్మెల్యే జోగు రామన్న బహింగ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్‌ రెడ్డి అబద్దాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. లేకపోతే కాళ్లు, చేతులు నరికి పంపిస్తామని జోగురామన్న హెచ్చరించారు. 
 
ఇటీవల ఇంద్రవల్లి దళిత దండోరా సభ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సభపై జోగు రామన్న మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగా ఇంద్రవెల్లి సభ జరిగిందన్నారు. 
 
ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన పగటి దొంగ రేవంత్‌కు తగిన శాస్తి జరిగే రోజు ముందే ఉందని జోగురామన్న ఆరోపించారు.
 
దళిత, గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదన్నారు. నాగోబా జాతరకు నిధులిచ్చి ఘనంగా నిర్వహిస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని తెలిపారు. గతంలో గిరిజన, ఆదివాసీ పండగలను సంస్కృతిని నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు వచ్చి గొప్పలు చెప్పుకుంటోందని జోగురామన్న విమర్శించారు. 
 
పోడు భూముల సమస్య పరిష్కారం కరోనా వల్ల కొంత ఆగిందన్నారు. దరఖాస్తులు ప్రభుత్వం వద్ద ఉన్నాయని.. త్వరలోనే అవి పరిష్కారమవుతాయి అని తెలిపారు. దళిత, గిరిజన, ఆదివాసీ కుటుంబాలకు వెలుగునిచ్చింది, ఇచ్చేది కేసీఆర్ మాత్రమే అని జోగు రామన్న పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు