రెండు తలల పామును విక్రయిస్తున్న ముఠా అరెస్ట్..

గురువారం, 16 సెప్టెంబరు 2021 (13:56 IST)
two headed snake
రెండు తలల పామును విక్రయిస్తున్న ఓ ముఠాను హైదరాబాద్‌లోని అటవీశాఖ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. రెడ్ శాండ్ గోవా పేరుతో పిలిచే రెండు తలల పామును ఘట్‌కేసర్ అటవీ ప్రాంతంలో కొంతకాలంగా ఈ ముఠా సభ్యులు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పామును ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందని, గుప్త నిధులు దొరుకుతాయానే అపోహను ప్రచారంలో పెట్టారు.
 
విశ్వసనీయ సమాచారాన్ని అందుకున్న అటవీశాఖ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి పాము కొనుగోలుదారులుగా ఆపరేషన్ సాగించారు. పాములను అమ్మే ప్రయత్నంలో ఉండగా.. పోలీసులు ఆ ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. సుమారు నాలుగున్నర కేజీల బరువుతో బలంగా ఉన్న ఈ పామును డెభై లక్షలకు అమ్ముతామంటూ నలుగురు సభ్యుల ముఠా బేరం పెట్టింది. 
 
అనేక సార్లు ఆపరేషన్ చేస్తున్న అధికారులను ఏమార్చే ప్రయత్నం చేస్తూ చివరకు ఈసీఐఎల్ సమీపం నాగారంలో ఓ ఇంట్లో దొరికిపోయారు. సగ్గుర్తి రోహిత్, జాలిగ శ్రీధర్, రాయుడు వెంకటరమణ, వీ. ఆంజనేయ ప్రసాద్ అనే నలుగురు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర ఉన్న ఓ కారును, టూ వీలర్, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అందరినీ మేడ్చల్ కోర్టులో హాజరుపరిచారు.
 
కాగా, రెండు తలల పాము వట్టి అపోహ మాత్రమేనని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆ పాము ద్వారా అదృష్టం, గుప్త నిధులు కలిసి రావడం అనేది వట్టి పుకార్లు మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. అలా ప్రచారం చేస్తూ డబ్బు చేసుకునే ముఠాల మాటలు ప్రజలు నమ్మవద్దని తెలిపారు. పామును అమ్మినా, కొన్నా చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు