సీఎం కేసీఆర్‌ గారూ.. ఆ తలకాయ సంగతేంటి? షర్మిల ప్రశ్న

శుక్రవారం, 9 జులై 2021 (10:41 IST)
తెలంగాణా రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్.షర్మిల కొత్త పార్టీని స్థాపించారు. ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఆమె తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌కు అనేక ప్రశ్నలు సూటింగా సంధించారు. 
 
'ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను కేసీఆర్‌ రోజూ అవమానిస్తున్నారు. రాష్ట్రంలోని 3 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల చొప్పున భూమి ఇస్తామని, కనీసం 30 మందికి కూడా ఇవ్వలేదు. పైగా గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్‌ భూములనూ లాక్కుంటున్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి చెయ్యలేదు కదా..! తల నరుక్కుంటానన్న కేసీఆర్‌.. ఆ తలకాయ సంగతేంటో చెప్పండి? అంటూ నిలదీశారు. 
 
దళితులపైన, గిరిజనులపైన దాడులు జరిగితే కేసీఆర్‌ రాక్షసానందం పొందుతారో ఏమో నాకు తెలియదు. ఇసుక లారీల కింద తమ పిల్లలు చనిపోతున్నారని మొరపెట్టుకుంటే వారిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. మొన్న మరియమ్మ అనే దళిత మహిళను లాక్‌ప్‌లో చంపేశారు. అంతకుముందు పోడు భూముల కోసం గిరిజన మహిళ పోరాటం చేస్తే బట్టలూడదీసి చెట్టుకు కట్టేసి కొట్టి హింసించారని ఆరోపించారు. 
 
ఇదీ.. కేసీఆర్‌ దొరకు ఎస్సీ, ఎస్టీలపై ఉన్న గౌరవం. సమాజంలో ఉన్నవారినే పట్టించుకోని కేసీఆర్‌.. అడవుల్లో ఉండే ఎస్టీల సమస్యలను పరిష్కరిస్తారా? వారి మాన, ప్రాణాలకు, జీవితాలకు రక్షణ లేదు.. మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్‌లు ఇస్తానని చెప్పి ఓట్లు గుంజుకుని మోసం చేశారు' అంటూ షర్మిల విరుచుకుపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు