ఆహా.. ఓహో... ఓరుగల్లు అందాలు

రమణీయ దృశ్యమాలికలను ఆవిష్కరించే వెండితెరపై ఒకప్పుడు నాలుగు గోడల మధ్య అమర్చిన సెట్టింగులు... బ్లాక్ అండ్ వైట్‌లో కళ్లముందు ఆవిష్కరింపజేసేవారు నాటి దర్శకనిర్మాతలు. నిండుపున్నమి వెండివెన్నెల కాంతులను అత్యంత అద్భుతంగా పూయించేవారు.

"గుండమ్మ కథ" చిత్రంలో పండువెన్నెల రాతిరి వేళలో వీచే చల్లని గాలులను ప్రకృతి ప్రసాదించిన నిజమైన పిల్లగాలులుగా అద్భుతంగా తెరకెక్కించారు. ఇలా చెప్పుకుంటూ పోతే... నాటి సినీ వెండి వెలుగులు ఎన్నో... ఎన్నెన్నో. అదిగో అలా మొదలైన సినీ తెలుగు సినీ సెట్టింగుల నిర్మాణం... నేడు లక్షల ఖర్చుతో ఏకంగా చార్మినార్, తాజ్‌మహల్‌నే ఆవిష్కరించే స్థాయికి ఎదిగింది.

ప్రేక్షకులలో ఉత్సుకతను రేకిత్తించేందుకు విదేశాలలో బంగీ‌జంప్‌లు, ఎత్తైన కట్టడాల చిట్ట చివరన నిలుచుని డ్యాన్స్‌లు... వగైరా వగైరా... విదేశీ దృశ్యాలన్నీ మన వెండితెరపై ఖర్చయిపోయాయి. మిగిలింది మన తెలుగింటి దృశ్యమాలికలే. అందుకనేనేమో మన తెలుగు దర్శక నిర్మాతలు తమ చిత్రాలను తెలుగునేలపై చిత్రించటానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.

దీనికితోడు పల్లె వాతావరణం ఉట్టిపడే చిత్రాలు భారీ విజయాలను చవిచూస్తుండటంతో వారి దృష్టి పల్లెలపై పడింది. నితిన్, ప్రియమణి జంటగా నటిస్తున్న ఓ చిత్రాన్ని ఇటీవల ఓరుగల్లు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఓరుగల్లు అందాలకు మైమరిచిపోయిన నితిన్ ఎక్కడో చిత్రీకరించాల్సిన పాటను సైతం ఓరుగల్లులోనే చిత్రించాలని సూచించాడు.

ఇక కథానాయిక ప్రియమణి మాట్లాడుతూ... తనకు వరంగల్లు కోట, ప్రాంతాలు ఎంతగానో నచ్చాయని చెప్పింది. అభిమానులు తమను ఎంతమాత్రం డిస్టర్బ్ చేయలేదని అంది.

ఇదిలా ఉంటే తను నిర్మించబోయే తదుపరి చిత్రం మొత్తం గంగదేవులపల్లిలో నిర్మిస్తానని ఓ నిర్మాత చెప్పినట్లు టాలీవుడ్ సినీవర్గాల కథనం. తమిళనాట విడుదలైన సుబ్రహ్మణ్యపురం నేపధ్యంలా అనిపిస్తోంది కదూ.

వెబ్దునియా పై చదవండి