'420'గా రానున్న జూనియర్ ఎన్టీఆర్.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో...

గురువారం, 15 సెప్టెంబరు 2016 (13:34 IST)
'జనతా గ్యారేజ్' సినిమా ఘనవిజయాన్ని సాధించడంతో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నాడు. తన తదుపరి చిత్రాన్ని వక్కంతం వంశీతో చేయాల్సి వున్నా... కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు వాయిదా పడింది. దాంతో పూరి జగన్నాథ్‌తో కలిసి ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. 
 
వాస్తవానికి ఎన్టీఆర్ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుందనే టాక్ కొంతకాలంగా వినిపిస్తోంది. ఈ సినిమాకి ఇంకా ఏ టైటిల్ అనుకోలేదనీ... పూర్తి కథ రెడీ అయిన తర్వాతనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని యూనిట్ సభ్యులు అంటున్నారు. 
 
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి '420' అనే టైటిల్‌ను పూరి పరిశీలిస్తున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా ''ఆంధ్రావాలా'' పరాజయం పాలైనా, రెండో సినిమా ''టెంపర్'' మాత్రం ఈ కాంబినేషన్‌కు ఓ ప్రత్యేక క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. 
 
దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగష్టులో సెట్స్‌పైకి వెళ్ళే సూచనలు కనిపిస్తోన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. 

వెబ్దునియా పై చదవండి