ఆ మధ్యన ప్రముఖ పేపర్కు ఇంటర్యూ ఇచ్చిన ఉదయభాను.. అమెరికాలో జరిగిన తనకు జరిగిన ఒక చేదు అనుభవం గురించి చెప్పింది. అమెరికాలో ఓ ప్రోగ్రామ్ చేసినపుడు.. ఓ ఫేమస్ టాలీవుడ్ సింగర్ తనను అవమానించిందట. సదరు సింగర్ను స్టేజ్ మీదకు పిలిచేటపుడు ఉదయభాను ఆమె గురించి ఎంతో గొప్పగా చెప్పేదట. కానీ ఆఖరి రోజున మాత్రం.. సదరు సింగర్ తనే ముందు స్టేజ్ పైకి వెళ్లి.. తరువాత ఉదయభానును పిలుస్తానని చెప్పిందట.
''అందరినీ స్టేజ్ మీదకు పిలిచినా.. నన్ను మాత్రం పిలువలేదు. చివరకు యాంకర్స్ మీద ఒక కమెడియన్ గ్యాంగ్ ఏదో స్కిట్ వేశారు. అప్పుడు వాళ్ళు నన్ను స్టేజీ మీదకు పిలిచారు. ఇంతలో ఆ సింగర్ తరపున వచ్చిన ఆర్కెస్ర్టా వారు.. నేను స్టేజెక్కుతుండగా ఒక నీరసం ట్యూన్ను బ్యాగ్రౌండ్లో ప్లే చేసి ఇంకా ఇన్సల్ట్ చేశారు'' అని చెప్పింది. ''ఆ సమయంలో నేనే స్టేజ్ పైకి వెళ్లి.. మళ్లీ నాకు అమెరికా రావాలని లేదు అని చెప్పాను. అప్పుడా సింగర్ ''నిన్ను పిలుద్దామనే అనకుంటున్నా.. అంటూ ఏవోవో సాకులు చెప్పింది. నేను పట్టించుకోలేదు'' అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు జరిగిన చేదు అనుభవాల గురించి చెప్పింది ఉదయభాను.
ఇంతకీ భానును అవమానించిన ఆ సింగర్ ఎవరో కాదు సునీత. ఇప్పుడు ఆ సన్నివేశం గురించి స్వయంగా సునీతే తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. పేపర్లో ఉదయభాను చెప్పింది నా గురించే అని నాకు అర్ధమైంది. నిజానికి ఉదయభాను తనను అపార్థం చేసుకుందని, ఆ ప్రోగ్రామ్కి రమ్మని తాను ఉదయభానుని పిలవలేదని, ఆర్గనైజర్లు ఆమెని పిలిచారని అలాంటప్పుడు తానెందుకు స్టేజ్పైకి పిలుస్తానని చెప్పింది. ఆమె స్టేజ్ మీదకు వస్తున్నప్పుడు తన టీమ్ విషాదంతో కూడిన మ్యూజిక్ ప్లే చేసిన విషయం తనకు గుర్తులేదని చెప్పుకొచ్చింది. ఆ టూర్ ముగిసిన తర్వాత చాల సార్లు నేను ఉదయభానును పలకరించాను కానీ ఆమె నాతో మాట్లాడలేదు'' అంటూ మీడియాతో తెలిపింది.