తెలంగాణ వచ్చాక కేసీఆర్ పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కృష్ణలో నీళ్లు తెలంగాణలోకి వచ్చిన వెంటనే ఒడిసి పట్టాల్సింది. జూరాల నుంచే నీరు తీసుకుందామని చిన్నారెడ్డి ఆరోజు సూచన చేశారు. ఆ రోజే చిన్నారెడ్డి మాట కేసీఆర్ వినిఉంటే నీళ్ల దోపిడి జరిగేది కాదు. చిన్నారెడ్డి సౌమ్యుడు కాబట్టి ఏం మాట్లాడలేదు. ఈ ద్రోహానికి కేసీఆర్ను వంద కొరడా దెబ్బలు కొట్టాలి. మేం సరిదిద్దుతుంటే తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసి మాపై నిందలు మోపుతున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కృష్ణా పరివాహక ప్రాంతంలోని రైతులకు మరణశాసనం రాసే అధికారం కేసీఆర్కు ఎవరూ ఇవ్వలేదన్నారు. జగన్ను పిలిచి సలహాలు ఇచ్చి, జీవోలు వచ్చేలా కేసీఆర్ సహకరించారు. కృష్ణానదిలో కేసీఆర్ చేసిన ద్రోహం ఉమ్మడి రాష్ర్టంలో సీమాంధ్ర పాలకుల కంటే వెయ్యిరెట్లు ఎక్కువ, తెలంగాణ జాతిపిత అని చెప్పుకునే కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేశారని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు.
జగన్, కేసీఆర్ మధ్య ఏముంది అనేది అసవసరం. బేసీన్లు లేవు, బేషజాలు లేవని కేసీఆర్ ఎట్ల అంటాడు. చర్చ చేద్దామంటే సభకు రాడు. కేసీఆర్ హయాంలో 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తే పెండింగ్లో ఉన్న ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. చేవేళ్ల పేరు పెట్టి నీళ్లు ఇవ్వకపోతే నిలదీస్తారని పేరు మార్చారు. 11 ఏఐబీపీ ప్రాజెక్టులను కేసీఆర్ ముట్టుకోలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.