తొలిసారి శింబు సరసన తమన్నా... కోలీవుడ్‌లో దశ తిరుగుతుందా?

సోమవారం, 24 అక్టోబరు 2016 (09:13 IST)
కోలీవుడ్ నటుడు శింబు హీరోగా శ్రియ హీరోయిన్‌గా 'ఎఎఎ' అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అందులో ఓ పాత్రలో శ్రియ నటిస్తుండగా, మరో పాత్రకు తమన్నాను ఎంపిక చేశారు. అధిక్‌ రవిచంద్రన్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా సినిమా విషయాన్ని ప్రకటించారు. తొలిసారి తమన్నా శింబు సరసన నటిస్తోందని ట్వీట్‌ చేశారు. 
 
ఇదిలావుంటే... ఇటీవలే ఆర్య సరసన తమన్నా చేసిన ''వాసువుం శరవణనుమ్ ఒన్న పదిచ్చవంగా'' సినిమా సూపర్ హిట్ అయింది. బాహుబలి చూపిన ప్రభావం... తమిళంలో ఆర్య జోడిగా చేసిన సినిమా సక్సెస్ కావడంతో అక్కడ తమన్నాకి అనూహ్యమైన స్థాయిలో క్రేజ్ పెరిగిపోయింది. దాంతో ఇప్పుడు అక్కడి దర్శకనిర్మాతలు తమన్నా ఇంటి ముందు క్యూ కడుతున్నారు. 
 
మరోవైపు ''వాలు'' సినిమాతో చాలాకాలం తర్వాత సక్సెస్ చూసిన శింబు, తమన్నా క్రేజ్ తనకి మరో హిట్ ఇస్తుందనే ఆనందంతో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. యువన్‌ శంకర్‌రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం 1980 నాటి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు ఇటీవల శ్రియ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి