జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. 'అరవింద సమేత' చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కనుంది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూట్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ త్వరలోనే ఈ సినిమా సెట్లోకి అడుగుపెట్టనున్నారు.
ఎన్టీఆర్30గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయంపై నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఓ పవర్ఫుల్ కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ కీలకపాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ‘క్రాక్’, ‘నాంది’ చిత్రాల్లో వరలక్ష్మి నటన చూసి ఫిదా అయిన త్రివిక్రమ్ ఎన్టీఆర్30లో ఓ రోల్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఆమె ఈ సినిమాలో పవర్ఫుల్ రాజకీయ నాయకురాలిగా కనిపించే అవకాశాలున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు ‘సర్కార్’, ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ చిత్రాల్లో రాజకీయ నాయకురాలి పాత్రను పోషించి వరలక్ష్మి గుర్తింపు తెచ్చుకున్న విషయం విధితమే. ఇక, తారక్ సినిమా విషయానికి వస్తే.. ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో హీరోయిన్గా మళ్లీ పూజా హెగ్డేకు ఛాన్సిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.