తమిళ సినీ నటుడు, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ మరోమారు తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆటో డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. ఈ వివరాలను పరిశీలిస్తే...
నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి కాకముందు నుంచే సేవా కార్యక్రమాలు చేపట్టిన కోలీవుడ్ నటుడు విశాల్, చెన్నైలో వరదల సమయంలో సంఘ సభ్యులతో పలు కార్యక్రమాలు నిర్వహించాడు. తాజాగా ప్రమాదంలో ఆర్ముగం మృతిచెందడంతో అతని కుటుంబం దిక్కులేనిదైందని తెలుసుకున్నాడు.
దీంతో తిరువళ్లూర్ జిల్లా తిరుత్తణి తాలూకా అక్కూరు గ్రామానికి వెళ్లిన విశాల్ ఆ కుటుంబ సభ్యులను పరామర్శించాడు. కుటుంబం నిలదొక్కుకునేందుకు ఆర్ముగం భార్యకు కిరణా షాపు పెట్టుకునేందుకు సాయం చేస్తానని, వారి కుమార్తె మనీషా (7) చదువుకయ్యే ఖర్చును ఒక అన్నగా భరిస్తానని మాట ఇచ్చాడు. విశాల్ మంచి మనసుకు అభిమానులు మరోసారి ఫిదా అయిపోయారు.