న్యూస్ యాంకర్ స్వేచ్ఛ కేసులో కీలక మలుపు.. ఠాణాలో లొంగిపోయిన పూర్ణచందర్

ఠాగూర్

ఆదివారం, 29 జూన్ 2025 (10:58 IST)
హైదరాబాద్ నగరంలో టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. శనివారం రాత్రి 11 గంటలకు తన అడ్వకేట్ సమక్షంలో హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషనుకు వచ్చిన ఆయన.. పోలీసులకు లొంగిపోయారు. కాగా, స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందర్ కారణంటూ చిక్కడపల్లి పోలీసులకు స్వేచ్ఛ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. దీంతో పూర్ణచందర్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్ 
 
ఆత్మహత్య చేసుకున్న న్యూస్ యాంకర్ స్వేచ్ఛతో తనకు సన్నిహిత సంబంధం ఉన్నమాట నిజమేనని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ వెల్లడించారు. స్వేచ్ఛ మరణానికి తానే కారణమంటూ ఆమె తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన మీడియాకు ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ఆయన పలు సంచలన విషయాలను వెల్లడిస్తూ, స్వేచ్ఛ జీవితంలోని విషాద కోణాలను ఆమెకు తనతో ఉన్న సంబంధాన్ని వివరించారు. తనపై వస్తున్న అబద్ధపు ప్రచారాన్ని ఆపడానికే ఈ నిజాలు చెప్పాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. 
 
తనకు స్వేచ్ఛ 2009 నుంచి తెలుసని, ఇద్దరూ కలిసి టీ-న్యూస్‌లో పని చేసేటపుడు మంచి స్నేహితులమని చెప్పారు. ఆ సమయంలో స్వేచ్ఛ తన వ్యక్తిగత విషయాలను పంచుకునేదని గుర్తు చేసుకున్నారు. అయితే, 2020 నుంచే తమ మధ్య సాన్నిహిత్యం పెరిగిన మాట నిజమేనని ఆయన అంగీకరించారు. రెండు విడాకుల తర్వాత తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్న స్వేచ్ఛకు తాను అండగా నిలిచానని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు