సుధీర్‌బాబు సొంత బ్యానర్లో సినిమా - మే 26న లోగో ఆవిష్కరణ!

గురువారం, 24 మే 2018 (20:47 IST)
ప్రేమ‌ క‌థా చిత్రం’, ‘భ‌లే మంచి రోజు’, ‘కృష్ణమ్మక‌లిపింది ఇద్దరినీ విభిన్న ప్రేమ‌ క‌థా చిత్రాల్లో న‌టించి.. విజ‌యం సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ‌ హీరో సుధీర్‌బాబు. బాలీవుడ్‌లో ‘బాఘి’ అనే చిత్రంలో విలన్‌గానూ మెప్పించారు. అయితే... ఇప్పుడు సుధీర్‌బాబు నిర్మాత‌గా మారారు. సుధీర్‌బాబు ప్రొడ‌క్షన్స్ పేరుతో బ్యాన‌ర్‌ని ప్రారంభించారు. ఈ ప్రొడక్షన్ హౌస్ లోగోను ఈనెల‌ 26న సినీ ప్రముఖుల స‌మ‌క్షంలో వైభ‌వంగా ప్రారంభించనున్నారు. 
 
ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. నిర్మాతగా మారి వరుస చిత్రాలను నిర్మించడానికి సుధీర్‌బాబు సన్నాహాలు చేస్తున్నారు. తన సొంత బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్ 1గా ఇప్పటికే ఓ చిత్రాన్ని ప్రారంభించారు. అది దాదాపు 80 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. మరోవైపు సుధీర్‌బాబు హీరోగా ‘సమ్మోహనం’ సినిమా రూపొందుతోంది. మంచి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. 
 
అలాగే సుధీర్‌బాబు హీరోగా మరో విభిన్న కథాంశంతో సిద్ధమవుతోన్న ‘వీరభోగ వసంత రాయలు’ అనే సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. 
 
ఇదిలా ఉంటే.. మాజీ బ్యాడ్మింటన్ ఛాంపియన్, ప్రస్తుత జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్‌లోనూ సుధీర్‌బాబు నటించ‌నున్నారు. ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్‌లో సుధీర్‌బాబు పాల్గొంటార‌ని సమాచారం. ఓ పక్క హీరోగా బిజీగా ఉంటూనే తన ప్రొడక్షన్‌పై వరసగా సినిమాలు నిర్మించాలని సుధీర్‌బాబు ప్లాన్ చేస్తున్నారు. మరి... హీరోగా సక్సెస్ అయిన ఈ ఘట్టమనేని వారి అల్లుడు నిర్మాతగానూ విజయం సాధిస్తాడేమో చూద్దాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు