అందాల నటుడు హరనాథ్ కూతురు పద్మజారాజు హఠాన్మరణం

మంగళవారం, 20 డిశెంబరు 2022 (17:20 IST)
Haranath, Padmaja Raju
ప్రముఖ నిర్మాత జి.వి.జి.రాజు భార్య పద్మజా రాజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమె వయసు 54 సంవత్సరాలు. ఇద్దరు కుమారులు ఉన్నారు. నాటి తరం అందాల హీరో హరనాథ్ కు పద్మజా రాజు కూతురు. ఆమె అన్న శ్రీనివాసరాజు కూడా నిర్మాతనే. పద్మజారాజు భర్త జి.వి.జి.రాజు,  పవన్ కళ్యాణ్ హీరోగా "గోకులంలో సీత, తొలిప్రేమ" వంటి చిత్రాలు నిర్మించారు. 
 
ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'గోదావరి' చిత్రం కూడా తెరకెక్కించారు. ఇటీవల పద్మజారాజు తన తండ్రి హరనాథ్ గురించి 'అందాలనటుడు' పేరుతో ఓ పుస్తకం వెలుగులోకి తెచ్చారు. ఆ పుస్తకాన్ని నటశేఖర కృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పద్మజా రాజు 'ఎన్.టి.వి- ఎంటర్ టైన్ మెంట్'తోనూ ముచ్చటించారు. ఈ సందర్భంగా త్వరలోనే తన కుమారుల్లో ఒకరు నిర్మాతగా పరిచయం కానున్నారనీ ఆమె తెలిపారు. వచ్చే యేడాది తన తనయుణ్ణి నిర్మాతగా పరిచయం చేసే ప్రయత్నాల్లోనే పద్మజ, ఆమె భర్త జి.వి.జి.రాజు ఉండగానే ఆమె హఠాన్మరణం చెందడం విచారకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరి, జీవీజీ రాజు, ఆయన కుమారులకు మనో ధైర్యం లభించాలని పలువురు సినీ ప్రముఖులు అభిలషించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు