పీకల దాకా మద్యం తాగి పోలీసులకు అడ్డంగా బుక్కైన నటి

మంగళవారం, 27 నవంబరు 2018 (09:37 IST)
మద్యం సేవించి వాహనం నడుపవద్దని పోలీసులు అనేక రకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సెలెబ్రిటీలతో ప్రచారం చేయిస్తున్నారు. కానీ, అదే సెలెబ్రిటీలు మద్యం సేవించి అడ్డంగా బుక్కవుతున్నారు. తాజాగా ఓ నటి, నృత్య కళాకారిణి, బిగ్‌బాస్ ఫేమ్ గాయత్రీ రఘురామ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడింది. ఈ విషయాన్ని పోలీసులు కూడా ధృవీకరించారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చెన్నై మహానగరంలోని ఎంఆర్‌సీ నగర్‌లో ఓ నక్షత్ర హోటల్ ఉంది. ఇందులో ఇటీవల ఓ పార్టీ జరిగింది. పార్టీకి వెళ్లిన గాయత్రీ రఘురామ్ తిరిగి వస్తున్న వేళ, అభిరామపురం ట్రాఫిక్ పోలీసులు, చెక్ పాయింట్ వద్ద మందు బాబుల కోసం తనిఖీలు చేపట్టారు. 
 
ఆ సమయంలో అటుగా వచ్చిన గాయత్రి కారును ఆపి, బ్రీత్ అనలైజర్‌లోకి గాలిని ఊదాలని కోరగా, ఆమె తాను ఆల్కహాల్ తీసుకున్నట్టు అంగీకరించింది. ఆపై పోలీసులు ఆమెకు తనిఖీలు చేసి, మోతాదుకు మించి మద్యం తీసుకున్నట్టు తేల్చి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె బీఏసీ 185 రావడం గమనార్హం.
 
గాయత్రీ రఘురాంను కారులో చూడటంతో ఆ ప్రాంతమంతా ప్రజలు, అభిమానులతో నిండిపోయింది. చుట్టూ హడావుడి పెరుగుతూ ఉండటంతో, ఆమెను ఇంటివరకూ దింపాలని నిర్ణయించుకున్నామని, ఆపై ఆమె వాహనం డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఏదైనా మొబైల్ కోర్టులో ఆమె రూ.3,500 జరిమానా చెల్లించి డాక్యుమెంట్లు తీసుకోవచ్చని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు