అదే కొండంత అండ - అదే శ్రీరామరక్ష- మోహన్ బాబు

బుధవారం, 18 మార్చి 2020 (20:01 IST)
మార్చి 19న మోహన్ బాబు పుట్టినరోజు. ప్రతి సంవత్సరం మోహన్ బాబు తన పుట్టినరోజు వేడుకలను శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల విద్యార్ధీని విద్యార్ధులతో కలిసి జరుపుకునేవారు. పుట్టినరోజు సందర్భంగా మోహన్ బాబు స్పందిస్తూ.... 1992లో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు ప్రారంభించాను. నా పుట్టినరోజైన మార్చి 19వ తేదీన శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల వార్షికోత్సవం జరుపుకుంటూ పిల్ల కళ్లల్లో ఆనందమే భగవంతుడి ఆశీస్సులుగా భావిస్తూ గత 27 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలను నిర్విఘ్నముగా జరుపుతున్నాను.
 
ఎందరో విజ్ఞానులు, శాస్త్రవేత్తలు, మేథావులు, కళాకారులు, అతిరధ మహారధులను ఆహ్వానిస్తూ వారి దివ్య సందేశాలను దాదాపు 40 వేల మంది విద్యార్థినీవిద్యార్ధులకు వారి తల్లిదండ్రులకు అందచేస్తూ వారిని చైతన్య వంతులను చేస్తున్న సంగతి మీకు తెలుసు కానీ.. ఈ సంవత్సరం ఓ మహమ్మరి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి మీకు తెలిసిందే. పంచభూతాలు మనకు ఇచ్చిన వరాలను మనమే శాపంగా మార్చుకుంటున్నాం. ప్రకృతిని మనమే నాశనం చేసుకుంటున్నాం. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాం. 
 
అందుకే ఈ మహమ్మరి ఒక దేశం నుంచి మరో దేశానికి గాలి కంటే వేగంగా ప్రయాణిస్తుంది. ప్రజలు గుంపులు గుంపులుగా సమూహంగా ఉన్నప్పుడు ఒకరి నుంచి మరొకరికి ప్రమాదం ఉంది. కేంద్రప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. చుట్టు పక్కల వాళ్లు బాగుంటేనే మనం బాగుంటాం. మీరు మా ఇంటికి రావాలి. మేము మీ ఇంటికి రావాలి. అందరూ బాగుండాలి అనేదే నా సిద్దాంతం. అందుకే ఈ సంవత్సరం మార్చి 19న జరగాల్సిన శ్రీ విద్యానికేతన్ పాఠశాల మరియు కళాశాల వార్షికోత్సవాల్ని మరియు అదే రోజున జరుపుకుంటున్న నా పుట్టినరోజు వేడుకలను కూడా ప్రస్తుతానికి వాయిదా వేయడం జరిగింది. 
 
సహృదయంతో అర్ధం చేసుకుని నా మిత్రులు, శ్రేయాభిలాషులు, అభిమానులు.. నాకు అభినందనలు తెలియచేయడానికి ఇంత దూరం రావద్దు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పెద్దల మాటలను దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ అభిమానమే నాకు కొండంత అండ.. మీ ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష. అందరికీ శార్వరీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ... ఈ తెలుగు ఉగాది మీ జీవితంలో వెలుగు తేవాలని కోరుకుంటున్నాను అని మోహన్ బాబు తెలియచేసారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు