డ్రగ్స్ కేసు : షారూక్ తనయుడికి మళ్లీ నిరాశ

బుధవారం, 20 అక్టోబరు 2021 (15:27 IST)
ముంబై డ్రగ్స్ కేసులో బాలీవుడ్ హీరో షారూక్‌ ఖాన్ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు మళ్లీ నిరాశ ఎదురైంది. బెయిలు కోసం ఆయన పెట్టుకున్న దరఖాస్తును ముంబై స్పెషల్ కోర్టు బుధవారం తోసిపుచ్చింది. అదేసమయంలో గురువారం వరకూ ఆర్యన్‌ను జ్యుడిషియల్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. 
 
ఈ కేసులో ఆర్యన్‌తో పాటు అర్బాజ్ మర్చెంట్, మున్‌మున్ ధమేఛా బెయిల్ దరఖాస్తులను కూడా కోర్టు నిరాకరించింది. అక్టోబర్ 2న ఆర్యన్, అర్బాజ్‌ సహా ఏడుగురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆర్యన్ ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్నాడు.
 
మరోవైపు, ఈ డ్రగ్స్ కేసులో ఆర్యన్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను ఎన్సీబీ సేకరించింది. ముఖ్యంగా, ఓ యువ నటితో ఆర్యన్ ఖాన్ జరిపిన డ్రగ్స్ చాటింగ్‌కు సంబంధించిన వివరాలను కోర్టుకు ఎన్సీబీ అధికారులు సమర్పించారు. దీంతో ఆయనకు ఇప్పట్లో కష్టాలు వీడేలా కనిపించడం లేదు. 
 
ఓ బాలీవుడ్‌ నటితో ఆర్యన్‌ డ్రగ్స్‌ గురించి చాటింగ్‌ చేసినట్లు ఎన్‌సీబీ దర్యాప్తులో గుర్తించింది. అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించింది. అంతేగాక, డ్రగ్స్‌ విక్రేతలతో ఆర్యన్‌ చాటింగ్‌ చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన వాట్సాప్‌ చాట్‌లను ఎన్‌సీబీ నేడు కోర్టుకు సమర్పించింది. 
 
డ్రగ్స్‌ విక్రేతలకు అతడు రెగ్యులర్ కస్టమర్‌ అని తమ దర్యాప్తులో తేలినట్లు ఎన్‌సీబీ వెల్లడించింది. ఆర్యన్ బెయిల్‌పై కోర్టు తీర్పు ఇవ్వనున్న సమయంలో ఎన్‌సీబీ ఈ నివేదిక సమర్పించడం గమనార్హం. వీటన్నింటిని పరిశీలించిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు