పవన్ కళ్యాణ్ కోసం ఏం చేయడానికైనా సిద్ధం: పృథ్వీరాజ్

శనివారం, 6 ఆగస్టు 2022 (17:57 IST)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమని టాలీవుడ్ సీనియర్ నటుడు పృధ్వీ రాజ్ ప్రకటించారు. నటుడు పృధ్వీ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను జనసేనలో చేరబోతున్నానని, మెగాబ్రదర్ నాగబాబును కలిశానని చెప్పారు. 
 
తాను వైఎస్సార్‌సీపీ కోసం కష్టపడి పనిచేశానని, అయితే కోవిడ్‌-19తో బాధపడుతున్నప్పుడు ఆ పార్టీకి చెందిన ఏ నాయకుడూ తనతో మాట్లాడలేదన్నారు. పృధ్వీరాజ్ గతంలో వైఎస్సార్‌సీపీ తరపున పనిచేసిన సంగతి తెలిసిందే.
 
గతంలో వైకాపా చీఫ్ జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఆయనకు మద్దతుగా వ్యవహించారు. వైసీపీకి అనుకూల వాయిస్ వినిపించే క్రమంలో రాజకీయ ప్రత్యర్ధుల పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 
 
జగన్ సీఎం అయిన తరువాత పృథ్వీరాజ్‌కు టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్వీబీసీ ఛైర్మన్‌గా నియమించారు. అయితే, ఆ సమయంలోనే ఆయన పైన కొన్ని లైంగిక ఆరోపణలు వచ్చాయి. వీటి పైన టీటీడీ విచారణకు ఆదేశించింది. దీంతో పాటుగా పృధ్విరాజ్‌ను ఆ పదవి నుంచి తప్పించింది.
 
అయితే, ఆ విచారణకు సంబంధించిన నివేదిక పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. ఇక, అప్పటి నుంచి కొంత కాలం మౌనంగా ఉన్న పృధ్విరాజ్ కరోనాతో బాధపడ్డారు. ఆ సమయంలో చిరంజీవి తనకు ప్రాణం నిలబెట్టారంటూ పృధ్వి చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు