రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒరిస్సా రాష్ట్రాన్ని భయపెట్టిన మొంథా తుఫాను మంగళవారం రాత్రి తీరాన్ని తాకింది. కాకినాడ - మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల్లో భారీగా గాలులు వీస్తున్నాయి. బంగాళాతంలో ఏర్పడిన ఈ తుఫాను ఏపీ, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాలను భయపెట్టిన విషయం తెల్సిందే.
ప్రచండ వేగంతో గాలులువీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోంగా మారింది. ఈ గాలులు తీవ్రత కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నెలకొరిగాయి. తుఫాను ప్రభావంతో కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో తీర ప్రాంతంలో 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
విశాఖపట్టణం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. సముద్రంలో అలలు 4 నుంచి 5 మిటర్ల మేరకు ఎగిసిపడుతున్నాయి. తీరంలోకి 1 నుంచి 2 మీటర్ల ఎత్తున సముద్రపు నీరు చొచ్చుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీచేశారు. దీని ఆధారంగా కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.