బాహుబలి ది బిగినింగ్ 2015 జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారతీయ చలనచిత్ర చరిత్రలో అద్భుత దృశ్యకావ్యంగా చరిత్రకెక్కిన బాహుబలి చిత్ర నిర్మాణం మొదలై ఇప్పటికి అయిదేళ్లు. 2011 ఫిబ్రవరిలో తాను ప్రభాస్తో అత్యంత భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు రాజమౌలి మొదటిసారిగా ప్రకటించాడు. బాహుబలి ది బిగినింగ్ చలనచిత్ర రికార్డులను తోసిపారేసింది. బాహుబలి 2 ఈ సంవత్సరం ఏప్రిల్ 27న విడుదలవుతోంది. భారత ప్రజానీకం బాహుబలి రెండో భాగం చూడటానికి కళ్లలో వత్తులు వేసుకుని మరీ చూస్తోంది.
మరి ఆ చిత్ర విజయ భారం మొత్తంగా తనమీద వేసుకుని చూసిన హీరో ప్రభాస్ స్పందనలేమిటి? అయిదేళ్ల కెరీర్ను ఫణంగా పెట్టి, ఒకే సినిమాకు కమిట్ కావడంలో చలనచిత్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డు సృష్టించిన ప్రభాస్ బాహుబలితో తన మహా ప్రయాణాన్ని ఎలా ఫీలువుతున్నాడు. అనుపమా చోప్రాకు తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బాహుబలితో తన ప్రారంభాన్ని గురించి పంచుకున్నాడు ప్రభాస్. రాజమౌళి కాకుంటే బాహుబలిలో నటించడానికి చస్తే ఒప్పుకుని ఉండేవాడిని కాననేశాడు.
"రాజమౌళి, ఆయన పని, అభినివేశం, తన ప్రమాణాలు వీటి కారణంగానే నేను బాహుబలికి సిద్ధమైపోయాను. తను లేకుంటే మేం ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఉండేవాళ్లం కాదు. అది సాధ్యమయ్యేదే కాదు. ప్రతి 10 రోజులకు రాజమౌళి కొన్ని దృశ్యాలతో, ఫిలిం స్క్రిప్టుతో మమ్మల్ని దిగ్భ్రాంతి పర్చేవాడు. స్క్రిప్టును సైతం మార్పుచేసి మరింత బాగారావడానికి విపరీతంగా శ్రమించాడు. నాలుగేళ్లపాటు బాహుబలితో మేమంతా కొనసాగేందుకు వెనుక ప్రేరణ రాజమౌళి.
కొన్ని వందలు కాదు.. వేలమంది నటులతో ఒకే ఒక్క సూత్రధారుడు అన్నీ తానై నడిపించిన అపరూప చిత్రం బాహుబలి. దాన్ని మరోవిధంగా రాజబలి అనుకూడా పిలిస్తే బాగుంటుందేమో. తొలిభాగాన్ని మించిన దృశ్య అద్భుతం బాహుబలి 2లో ప్రేక్షకులకు కనువిందు చేయనుందని ప్రభాస్, రానా తదితరులు ఇప్పటికే చెప్పడంతో ప్రేక్షకులు వెర్రెత్తిపోతున్నారు.